లక్నో : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తితో ప్రజలు వైద్య సదుపాయాలు లేక అల్లాడుతుంటే యూపీలోని ఆగ్రా జిల్లా దవాఖానలో సిబ్బంది కొరతతో కేంద్రం సమకూర్చిన అత్యాధునిక వెంటిలేటర్లను మూలన పడేశారు. ఈ మిషన్లను వైద్య నిపుణులు, టెక్నీషియన్ల సహకారంతోనే వాడాల్సిన క్రమంలో పలు దవాఖానల్లో వీటిని పక్కనపెట్టడంతో కరోనా రోగుల ప్రాణాలు గాల్లో కలుస్తున్న పరిస్థితి నెలకొంది. విపత్తు వేళ ప్రజల ప్రాణాలను కాపాడే వెంటిలేటర్లను పీఎం కేర్స్ ఫండ్ నిధులతో కొనుగోలు చేసి పంపినా ఆయా దవాఖానల్లో వాటిని వాడకపోవడం యూపీ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల లేమికి అద్దం పడుతోంది.
ఈ యంత్రాన్ని వాడటం తెలిసిన సాంకేతిక అవగాహన కలిగిన వైద్య నిపుణులు లేకపోవడంతో వాటిని పక్కన పెట్టారని ఆగ్రా జిల్లా యంత్రాంగం పేర్కొంది. గత కొద్ది నెలలుగా రెండు వెంటిలేటర్లను వాడకపోవడంతో వాటికి దుమ్ము పట్టిందని జిల్లా దవాఖానలో సీనియర్ వైద్యులు చెప్పుకొచ్చారు. తమ ఆస్పత్రికి ఆక్సిజన్ సరఫరాలు కూడా తగినంతగా ఉండటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ దగ్గర ఉన్న కొద్దిపాటి వనరులు, సదుపాయాలతోనే రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు శ్రమిస్తున్నామని వారు చెబుతున్నారు.