చెన్నై: సాధారణంగా పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలుకుతారు. అయితే 22 ఏండ్ల పాటు సేవలందించిన ఒక ప్రభుత్వ వాహనానికి ఆ శాఖ సిబ్బంది ఘనంగా వీడ్కోలు చెప్పారు. ఈ అరుదైన ఘటన తమిళనాడులో జరిగింది. 1999 మార్చి 24న కొనుగోలు చేసిన మారుతి జిప్సీ వెల్లూర్ పోస్ట్ ఆఫీస్కు ఎనలేని సేవలందించింది. గత 22 ఏండ్లుగా 25 మంది పోస్టల్ సూపరింటెండెంట్లు ఈ వాహనాన్ని తనిఖీల కోసం వినియోగించారు. ఇందులో ప్రయాణించి జిల్లాలోని జావాధు కొండలతో సహా కొండ ప్రాంతాల్లోని పోస్టాఫీసులను సందర్శించేవారు. గత 22 ఏండ్లలో ఈ జిప్సీకి ఒక్కసారి కూడా యాక్సిడెంట్ కాకపోవడం మరో విశేషం.
మంచి కండీషన్లో ఉండి తళతళ మెరిసే ఈ మారుతి జిప్సీని ప్రభుత్వ నిబంధనల ప్రకారం డిస్పోజ్ కోసం మెయిల్ మోటార్ సర్వీస్కు అప్పగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వ వాహనంతో ఎంతో అనుబంధం ఉన్న వెల్లూర్ పోస్టల్ కార్యాలయం అధికారులు, సిబ్బంది ఇటీవల దీనికి ఘనంగా వీడ్కోలు పలికారు. వాహనం ముందు భాగాన్ని పూలు, పూల దండలతో అందంగా అలంకరించారు. ఫొటోలు దిగడంతోపాటు దానికి సెల్యూట్ కూడా చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి స్వీట్లు పంచి పెట్టారు.
సాధారణంగా ప్రభుత్వ వాహనాలకు ఈ విధంగా వీడ్కోలు ఉండదు. అయితే వెల్లూర్ పోస్టల్ కార్యాలయం సిబ్బంది మాత్రం, శాఖకు 22 ఏండ్లు సేవలందించి వేలాది కిలోమీటర్లు ప్రయాణించి అలసిన ఈ ప్రభుత్వ వాహనానికి ఎంతో ప్రత్యేకంగా, వేడుకగా, ఉద్వేగ భరితంగా గుడ్బై చెప్పారు.