న్యూఢిల్లీ : భారత్తో రఫేల్ ఒప్పందంలో అవినీతి ఆరోపణలపై ఫ్రాన్స్ న్యాయమూర్తి క్రిమినల్ దర్యాప్తును ప్రారంభించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. రఫేల్ ఒప్పందం నుంచి హిందుస్ధాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తప్పుకున్న 15 రోజుల తర్వాత 2015 మార్చి 26న రిలయన్స్ తొలి ఎంఓయూపై సంతకం చేసినట్టు ఫ్రెంచ్ వెబ్సైట్ మీడియాపార్ట్ పత్రాల్లో కనిపించిందని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ట్వీట్ చేశారు. ఈ వ్యవహారం పలు అనుమానాలకు తావిస్తోందని ఆయన ఆరోపించారు.
రఫేల్ ఒప్పందంలో పలు అవకతవకలకు సంబంధించిన పత్రాలు, నివేదికలను మీడియాపార్ట్ వెబ్సైట్లో పొందుపరిచారు. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఫ్రాన్స్ రక్షణ రంగ దిగ్గజం దసాల్ట్తో 36 యుద్ధ విమానాల సరఫరా కాంట్రాక్టుపై భారత్ సంతకాలు చేసింది.ఏప్రిల్ 2022 నాటికి అన్ని రఫేల్ విమానాలు భారత వాయుసేన (ఐఏఎఫ్)లో చేరతాయని ఐఏఎఫ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.తొలి బ్యాచ్లో భాగంగా ఐదు రఫేల్ యుద్ధ విమానాలు గత ఏడాది జులై 27న అంబాలాలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు చేరుకున్న సంగతి తెలిసిందే. రఫేల్ ఒప్పందంలో అవినీతి వ్యవహారంతో పాటు పలువురికి కమీషన్లు ముట్టాయని మోదీ సర్కార్ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.