న్యూఢిల్లీ: దేశంలోని ప్రధాన రహదారులపై ప్రస్తుతం ఉన్న వాహన గరిష్ఠ వేగం పరిమితిని మరో 20 కిలోమీటర్లు (గంటకు) మేర పెంచాలని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు. వంపు తిరిగిన రోడ్ల మీద వాహనాల గరిష్ఠ వేగం ఏకీకృతంగా ఉండాలన్నారు. ప్రస్తుతం జాతీయ రహదారులపై ఒక కారు గరిష్ఠంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో, ఎక్స్ప్రెస్వేపై 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చని కేంద్రం నిర్ణయించింది. తమ రాష్ట్రంగుండా వెళ్లే జాతీయ రహదారి, ఎక్స్ప్రెస్వేపై ప్రయాణించే వాహనాల గరిష్ఠ వేగాన్ని నిర్ణయించే అధికారం ఆయా రాష్ట్ర పోలీసులకు, ప్రభుత్వ ఏజెన్సీలకు కూడా ఉన్నది. దీంతో వివిధ రాష్ర్టాల్లో వాహనాల గరిష్ఠ వేగం పరిమితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.