హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. ఏ ఎన్నిక అయినా బీసీలంతా టీఆర్ఎస్ వెంటే ఉంటారని, తామంతా గులాబీ పార్టీకే మద్దతు ఇస్తామని విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్యవేదిక సంఘం స్పష్టంచేసింది. ఈ మేరకు ఆ సంఘాల ప్రతినిధులు హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో శనివారం బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను వేర్వేరుగా కలి తమ మద్దతు లేఖలను అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి మాట్లాడుతూ.. దేశంలో ఏ ప్రభుత్వం చేయనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వెనకబడిన కులాల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నారని కొనియాడారు. విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘాల ప్రతినిధులు పలు అంశాలు ప్రస్తావించగా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తామని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి వడ్ల హనుమాండ్లు తదితరులు పాల్గొన్నారు.