పూడూరు , జూలై 12 : ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంతో మండలంలోని రేగడి మామిడిపల్లి గ్రామం రూపు మారింది. గ్రామంలో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించారు. ప్రతి రోజు పంచాయతీ ట్రాక్టర్తో ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ప్రతి వీధిలోనూ చెత్త లేకుండా చూడడంతో పాటు కలుపు మొక్కలను తొలగించడంతో పల్లెంతా పరిశుభ్రంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెలా ఇస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో అభివృద్ధి పనని పూర్తి చేసుకుంటున్నారు. హరితహారంలో భాగంగా గ్రామంలోని వీధులతో పాటు గ్రామానికి రోడ్డు వెంట మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. నిత్యం పంచాయతీ నీటి ట్యాంకర్తో నీటిని పడుతున్నారు. అవి ఏపుగా పెరిగి పచ్చగా కళకళలాడుతున్నాయి. మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లాను వేశారు. సరిపడా నీరు సరఫరా అవుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పురాతన ఇండ్లను తొలగించి శుభ్రం చేశారు. చివరి మజిలీ కోసం వైకుంఠధామాన్ని నిర్మించారు. డంపింగ్ యార్డు నిర్మాణం పూర్తి కాగా, పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించి వివిధ రకాల మొక్కలను నాటారు. పచ్చని మొక్కలతో పాటు పూల మొక్కలు నాటడంతో పూలు పూసి కనువిందు చేస్తున్నాయి. ఎమ్మెల్యే కె.మహేశ్రెడ్డి కృషితో రూ.కోటి 60లక్షలతో గ్రామానికి వచ్చే రోడ్డును నిర్మించారు. రోడ్డుకు ఇరువైపులా హరితహారం మొక్కలను నాటారు. ‘పల్లె ప్రగతి’ గ్రామ రూపురేఖలు మారడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా సరిహద్దులో గ్రామం..
రేగడి మామిడిపల్లి గ్రామం వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్నది. గత ప్రభుత్వాలు ఈ గ్రామాన్ని పట్టించుకో లేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.13 లక్షలతో వైకుంఠధామం, రూ.10 లక్షలతో సీసీ రోడ్లు, రూ. 3లక్షలతో డ్రైనేజీలు, మరో రూ.3లక్షలతో డ్రైనేజిలపై కల్వర్టులు, ఎన్ఆర్ఈజీఎస్ నుంచి రూ.10 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవనం, రూ.10లక్షలతో మిషన్ భగీరథ నీటి ట్యాంక్ నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనులు చకచకా పూర్తయ్యాయి. గ్రామంలోని 253 నివాసాలకు నల్లా కనెక్షన్ ఇచ్చి నీటిని సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే గ్రామంలోని బోరు మోటర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. రూ.10 లక్షలతో ట్రాక్టర్ను కొనుగోలు చేసి, ఇద్దరు పంచాయతీ కార్మికులతో నిత్యం చెత్తను సేకరిస్తున్నారు.
పల్లె ప్రకృతి వనం..
గ్రామంలోని 20 గుంటల భూమిలో పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించారు. దీనికి ప్రభుత్వం రూ.1.20లక్షలను కేటాయించింది. ఈ పార్కులో రకరకాల పూల మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. హరితహారంలో భాగంగా గ్రామంలో గడిచిన ఏడాది సుమారు 8 వేల మొక్కలను నాటారు. ప్రస్తుతం మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగడంతో పాటు గ్రామస్తులను భాగస్వాములను చేస్తూ ఇంటింటికీ ఆరు మొక్కలను పంపిణీ చేస్తున్నారు.
స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాం…
తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు చెత్త బుట్టలను పంపిణీ చేశాం. నిత్యం పంచాయతీ ట్రాక్టర్తో వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నాం. కంపోస్టు యార్డులో సేంద్రియ ఎరువును తయారు చేసి వినియోగించుకుంటున్నాం. గ్రామంలో సీసీ రోడ్లు, మురుగు కాల్వలను నిర్మించాం. వైకుంఠధామం నిర్మాణం పూర్తి కాగా, అందుబాటులోకి వచ్చింది. పల్లె ప్రకృతి వనం నిర్మాణం గ్రామానికి వన్నె తెచ్చింది. ఎమ్మెల్యే మహేశ్రెడ్డి సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటాం.