ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో మరో శతకం నమోదైంది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ దేవదత్ పడిక్కల్(101 నాటౌట్: 52 బంతుల్లో 11ఫోర్లు, 6సిక్సర్లు) మెరుపు సెంచరీ బాదేశాడు. ఐపీఎల్లో అతనికిదే తొలి శతకం కావడం విశేషం. రాజస్థాన్ నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు వికెట్ కూడా కోల్పోకుండా ఆడుతూ పాడుతూ ఛేదించింది. బెంగళూరుకు ఇదే అత్యధిక(181*) ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం విశేషం.
ఓపెనర్లు చెలరేగడంతో ఆర్సీబీ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. పడిక్కల్ సెంచరీతోకి తోడు విరాట్ కోహ్లీ(72: 47 బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు) వీరవిహారం చేయడంతో బెంగళూరు 16.3 ఓవర్లలోనే టార్గెట్ను పూర్తి చేసింది. వరుసగా ఆడిన నాలుగు మ్యాచ్ల్లో గెలిచిన కోహ్లీసేన పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. బెంగళూరు బౌలర్లు రాణించిన పిచ్పై రాజస్థాన్ బౌలర్లు తేలిపోయారు.
అంతకుముందు శివమ్ దూబే(46: 32 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు), రాహుల్ తెవాటియా(40: 23 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) అద్భుత ప్రదర్శన చేయడంతో రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులు చేసింది. 43/4తో కష్టాల్లో ఉన్న జట్టును ఈ ఇద్దరే ఆదుకున్నారు. బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ చెరో మూడు వికెట్లు తీయగా..జేమీసన్; రిచర్డ్సన్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు. ఆరంభంలోనే బెంగళూరు బౌలర్ల దెబ్బకు జోస్ బట్లర్(8), మనన్ వోహ్రా(7), డేవిడ్ మిల్లర్(0), సంజూ శాంసన్(21) పెవిలియన్ బాట పట్టారు.