తిరువనంతపురం, జూన్ 2: కరోనాతో దేశ ప్రజలు సతమతమవుతున్నారని, కాబట్టి కేంద్రమే అన్ని రాష్ర్టాలకు ఉచితంగా వ్యాక్సిన్లను అందజేయాలని కేరళ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కరోనా ఫస్ట్వేవ్ కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని, ఇప్పుడు సెకండ్వేవ్తో మరింత పతనమవుతున్నదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. సమయానికి అందరికీ టీకాలు వేస్తే కరోనాను జయించవచ్చని, ఇదే సమయంలో ఆర్థిక వ్యవస్థ కూడా కోలుకుంటుందని చెప్పారు. కాబట్టి కేంద్రం ఆలస్యం చేయకుండా సకాలంలో అన్ని రాష్ర్టాలకు ఉచితంగా టీకాలను అందజేయాలని కోరుతూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.
కేంద్రానికి ‘టీకాల బాధ్యత’ను గుర్తు చేద్దాం!
భువనేశ్వర్, జూన్ 2: తదుపరి కరోనా వేవ్ల నుంచి ప్రజలను కాపాడటానికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని, ఆ బాధ్యతను కేంద్రం చేపట్టేలా దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో ముందుకురావాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖ రాసి.. దానిని ట్విట్టర్లో షేర్ చేస్తూ, ఆయా సీఎంలను ట్యాగ్ చేశారు. దేశంలో టీకాల కొరత నేపథ్యంలో విదేశాల్నించి టీకాలను సేకరించుకోవటానికి కేంద్రం అనుమతించినప్పటికీ.. విదేశీ కంపెనీలు రాష్ట్రాలతో ఒప్పందాలు కుదుర్చుకోవటానికి ముందుకురాని సంగతిని పట్నాయక్ గుర్తుచేశారు. కేంద్రమే వ్యాక్సిన్లను సేకరించి రాష్ట్రాలకు సరఫరా చేయటం తప్ప మరోమార్గం లేదన్నారు. దీనికోసం అన్ని రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో ముందుకుసాగాలన్నారు. స్వాతంత్య్రోద్యమం తర్వాత దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద విపత్తు కరోనాయేనని నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు.