న్యూఢిల్లీ, మే 1: కరోనా టీకాల కొరతతో చాలా రాష్ర్టాల్లో మూడో దశ వ్యాక్సినేషన్ శనివారం ప్రారంభం కాలేదు. ఈ విడతలో 18 నుంచి 45 ఏండ్లలోపు వారికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంది. కేవలం ఆరు రాష్ర్టాలు.. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, రాజస్థాన్లలో మాత్రమే వ్యాక్సినేషన్ మొదలైంది. అది కూడా కొన్ని జిల్లాలకే పరిమితమైంది. మరికొన్ని రాష్ర్టాలు తర్వాత ప్రారంభిస్తామని ప్రకటించాయి. ఢిల్లీలో సోమవారం మొదలుపెడుతామని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. వ్యాక్సిన్ నిల్వలు వచ్చాక తేదీలను ప్రకటిస్తామని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ చెప్పారు. తమ వద్ద సరిపడా టీకా డోసులు లేవని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి ప్రకటించాయి. టీకా కొరత వల్ల మూడో దశ కొన్ని రోజులు ఆలస్యమవుతుందని కేరళ స్పష్టం చేసింది.