న్యూఢిల్లీ, జూన్ 9: అధ్యాపకుల పరిశోధన పత్రాల సమర్పణ (సైటేషన్స్ పర్ ఫ్యాకల్టీ)లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ప్రపంచంలోనే అత్యుత్తమ పరిశోధనా విశ్వవిద్యాలయంగా క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో చోటు సంపాదించింది. ఈ విభాగంలో 100/100 మార్కులు సాధించి… మసాచుసెట్స్, ప్రిన్స్టన్, హార్వర్డ్ యూనివర్సిటీల సరసన నిలిచింది. ఓవరాల్ ర్యాంకింగ్లో గతేడాది కన్నా ఒక ర్యాంకు దిగజారి 186వ స్థానంలో నిలిచింది. తెలంగాణ నుంచి మూడు వర్సిటీలు ఈ జాబితాలో చోటు సంపాదించాయి. క్యూఎస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ బుధవారం విడుదలయ్యాయి. ఐఐటీ బాంబే 177వ ర్యాంకుతో దేశంలోనే అత్యుత్తమ వర్సిటీగా నిలిచింది. కానీ గతేడాది కంటే నాలుగు ర్యాంకులు పడిపోయింది. ఐఐటీ ఢిల్లీ 185వ ర్యాంకు పొందింది. భారత్ నుంచి ఈ మూడు వర్సిటీలు మాత్రమే టాప్-200లో చోటు సంపాదించాయి. ఐఐటీ మద్రాస్ 20 స్థానాలు మెరుగుపర్చుకొని 255వ ర్యాంకు సాధించింది. ఐఐటీ గువాహటి 395వ ర్యాంకుతో తొలిసారి టాప్ 400లో చోటు సాధించింది. జేఎన్యూ తొలిసారి ఈ ఏడాది ఈ ర్యాంకింగ్స్లో చోటు సాధించింది. బ్రిటన్కు చెందిన క్వాక్వారెల్లి సైమండ్స్ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలకు ర్యాంకులను ప్రకటిస్తుంది. ఈ ఏడాది 1,300 వర్సిటీలకు ర్యాంకులు కేటాయించారు. ఈ జాబితాలో భారత్ నుంచి మొత్తం 38 వర్సిటీలు ఉన్నాయి. మసాచుసెట్స్ వర్సిటీ వరుసగా పదో ఏడాది అత్యుత్తమ వర్సిటీగా ఘనత సాధించింది. ఆక్స్ఫర్డ్ రెండో స్థానంలో ఉంది.
సిటీబ్యూరో, జూన్ 9(నమస్తే తెలంగాణ): క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో తెలంగాణ నుంచి మూడు విశ్వవిద్యాలయాలు చోటు సంపాదించాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్ (ఐఐటీహెచ్) 591-600 మధ్యలో ర్యాంకు సాధించగా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(యూవోహెచ్) 651-700 మధ్యలో స్థానం సంపాదించింది. ఉస్మానియా యూనివర్సిటీ 1001-2000 మధ్య ర్యాంకుల్లో స్థానం సాధించింది.