న్యూఢిల్లీ, జూన్ 8: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకా అందించడంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వారికి వ్యాక్సినేషన్ కోసం ప్రజలు ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు ఆర్బీఐ ఆమోదిత ఎలక్ట్రానిక్ వోచర్ల వినియోగాన్ని ప్రోత్సహించనున్నట్టు తెలిపింది. ఈ వోచర్లను ప్రైవేట్ సెంటర్లలో రిడీమ్ చేసుకోవచ్చని వెల్లడించింది. జాతీయ వ్యాక్సినేషన్ విధానంపై కేంద్రం మంగళవారం సవరణ మార్గదర్శకాలను జారీచేసింది. ఈ నెల 21 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి.
వ్యాక్సిన్ తయారీ సంస్థ జీఎస్టీ సేవారుసుం ప్రైవేట్ దవాఖానల్లో ప్రకటించిన ధర గరిష్ఠ ధర
కొవిషీల్డ్ 600 30 150 780
కొవాగ్జిన్ 1200 60 150 1410
స్పుత్నిక్వీ 948 47 150 1145
44 కోట్ల డోసులకు కేంద్రం ఆర్డర్లు
దేశంలో 18 ఏండ్లు నిండినవారందరికీ ఉచితంగా టీకా వేయించే బాధ్యత తనదేనని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం 44 కోట్ల వ్యాక్సిన్ డోసులకు ఆర్డర్లు ఇచ్చింది. 25 కోట్ల కొవిషీల్డ్ డోసుల కోసం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థకు ఆర్డర్ ఇవ్వగా, 19 కోట్ల కొవాగ్జిన్ డోసుల కోసం హైదరాబాదీ సంస్థ భారత్ బయోటెక్కు ఆర్డర్ ఇచ్చింది. ఆగస్టు-డిసెంబర్ మధ్యలో ఈ వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని కేంద్రం తెలిపింది. టీకాల సేకరణ కోసం ఈ రెండు సంస్థలకు అదనంగా 30 శాతం అడ్వాన్స్ చెల్లించినట్టు వెల్లడించింది.