న్యూఢిల్లీ: కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ల మిక్సింగ్ ( Vaccine Mixing ) కు సంబంధించిన అధ్యయనానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతినిచ్చింది. తమిళనాడులోని వెల్లూర్ కాలేజీలో వ్యాక్సిన్ మిక్సింగ్పై అధ్యయనం చేపట్టనున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. సుమారు 300 మంది వలంటీర్లపై వెల్లూర్లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్లో త్వరలో ట్రయల్స్ నిర్వహించనున్నారు. వ్యాక్సిన్ మిక్సింగ్పై స్టడీ చేపట్టాలని జూలై 29న సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఓ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. అయితే మిక్సింగ్పై గతంలో ఐసీఎంఆర్ చేసిన స్టడీకి ఇది భిన్నంగా ఉండనున్నది.
ఇప్పటికే యూపీలో వ్యాక్సిన్ మిక్సింగ్పై స్టడీ చేశారు. అక్కడ తొలి డోసు రూపంలో కోవీషీల్డ్.. మరో ఆరు వారాల వ్యవధిలో రెండవ డోసుగా కోవాగ్జిన్ ఇచ్చారు. 18 మంది వాలంటీర్లకు మిశ్రమ వ్యాక్సిన్లు ఇచ్చారు. మిక్సింగ్ సురక్షితమే కాదు, ఉత్తమ రోగ నిరోధక శక్తి వచ్చినట్లు ఐసీఎంఆర్ తన తొలి స్టడీలో తేల్చింది. అయితే మిశ్రమ టీకాలపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని నిపుణుల కమిటీ భావిస్తున్న నేపథ్యంలో వెల్లూర్ మెడికల్ కాలేజీలో మరోసారి ట్రయల్స్ నిర్వహించనున్నారు.