న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: టీకా ఉత్సవ్ను కరోనా మహమ్మారిపై రెండో యుద్ధానికి నాందిగా ప్రధాని మోదీ అభివర్ణించారు. సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకాలు అందించే లక్ష్యంతో ఆదివారం దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్ ప్రారంభమైంది. బుధవారం వరకు ఇది కొనసాగనున్నది. ఈ సందర్భంగా నాలుగు విషయాలను ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలని ఒక ప్రకటనలో ప్రధాని కోరారు. ‘ప్రతి ఒక్కరు మరొకరికి టీకా వేయించాలి. ప్రతి ఒక్కరు మరొకరికి చికిత్స అందేలా చూడాలి. ప్రతి ఒక్కరు మరొకరిని రక్షించాలి. ఎవరికైనా కరోనా సోకితే చిన్న కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయడానికి ఆయా కుటుంబాలు, చుట్టుపక్కలవారు చొరవ చూపాలి’ అని సూచించారు. వృద్ధులకు, చదువుకోని వారికి టీకా వేయించుకోవడానికి సహాయం అందించాలన్నారు. స్థోమత లేని, సమాచారం తెలియని కరోనా రోగులకు చికిత్స అందించేందుకు చేయూతనందించాలని కోరారు. ప్రజలు వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రతను, నిబంధనలను పాటించాలని సూచించారు.