న్యూఢిల్లీ : దేశంలో 18 ఏండ్లు పైబడిన వారందరికీ ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికల్లా కరోనా టీకాలు వేసేందుకు ప్రయత్నిస్తున్నామని శనివారం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఉచిత టీకా పొందేందుకు అందరూ అర్హులేనని పేర్కొంది. గత నెల 31న జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్ విధానాన్ని తూర్పారబడుతూ పలు ప్రశ్నలను లేవనెత్తింది. వాటిపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 375 పేజీల అఫిడవిట్ను దాఖలు చేసింది. వ్యాక్సిన్ సేకరణలో ఎదురవుతున్న సమస్యలపై రాష్ర్టాలు, ప్రైవేటు దవాఖానలు ఫిర్యాదు చేయడంతో విధానంలో మార్పులు చేసినట్టు అఫిడవిట్లో తెలిపింది. దేశంలో ఆగస్టు-సెప్టెంబరు మధ్యలో 135 కోట్ల డోసులను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించింది. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం పరిమితంగా ఉండటం వ్యాక్సినేషన్పై ప్రతికూల ప్రభావం చూపదని తెలిపింది.