కరోనా తీవ్రత అధికంగా ఉన్న జిల్లాలపై దృష్టి పెట్టాలని సూచన
45 ఏండ్లు దాటినవారందరికీ వ్యాక్సిన్
సెకండ్వేవ్ నేపథ్యంలో అమల్లోకి నిర్ణయం
రాష్ర్టాలతో కేంద్రం సమీక్ష
న్యూఢిల్లీ, మార్చి 31: దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రం మరింత విస్తృతం చేసింది. మూడో దశలో భాగంగా 45 ఏండ్లు నిండిన వారందరికీ గురువారం నుంచి టీకాలను ఇవ్వనున్నారు. ఈ మేరకు కేంద్రం ఇటీవల తీసుకున్న నిర్ణయం అమల్లోకి రానున్నది. దేశంలో జనవరిలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి విడుతలో హెల్త్కేర్ వర్కర్లకు, ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ చేపట్టారు. రెండో దశలో 60 ఏండ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏండ్లు పైబడినవారికి టీకా ఇస్తున్నారు. ఇక మూడో దశలో 45 ఏండ్లు పైబడిన వారందరికీ (దీర్ఘకాలిక వ్యాధులు లేకపోయినా కూడా) టీకా ఇవ్వాలని కేంద్రం ఇటీవలే నిర్ణయించింది. గురువారం నుంచి ఇది అమల్లోకి రానున్నది. వ్యాక్సినేషన్ కోసం మధ్యాహ్నం 3 గంటల తర్వాత సమీప వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి గానీ, లేదా కొవిన్ పోర్టల్లో గానీ రిజస్టర్ చేసుకోవచ్చు. ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా రిజిస్టర్ చేసుకునే సౌలభ్యం ఉన్నది.
టీకా వృథాను తగ్గించండి
వ్యాక్సినేషన్ ప్రక్రియపై బుధవారం అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కేంద్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. వ్యాక్సిన్ కవరేజీ తక్కువగా ఉన్న ప్రాంతాలను (ప్రత్యేకించి కరోనా తీవ్రత అధికంగా ఉన్న జిల్లాల్లో ) గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో డాక్టర్ ఆర్ఎస్ శర్మ, కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఈ సమావేశం నిర్వహించారు. హెల్త్కేర్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వర్కర్ల వ్యాక్సినేషన్కు సంబంధించి అర్హులైన వారికే టీకా అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ర్టాలకు సూచించారు. వ్యాక్సిన్ నిల్వ, వినియోగంపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని కోరారు. వ్యాక్సిన్ల నిరుపయోగం ఒక శాతం కంటే తక్కువ (ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇది ఆరు శాతంగా ఉన్నది) ఉండేలా చూడాలన్నారు.
‘కొవిషీల్డ్’ జీవితకాలం 9 నెలలు
ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా తయారుచేసిన కరోనా టీకా కొవిషీల్డ్ వినియోగ గడువును తయారీ తేదీనుంచి 9 నెలలకు పొడిగిస్తూ భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) నిర్ణయం తీసుకున్నది. ఇప్పటివరకు 6 నెలలుగా ఉన్న వ్యాక్సిన్ జీవితకాలాన్ని 9 నెలలకు పొడిగించింది. ఈ మేరకు కొవిషీల్డ్ను ఉత్పత్తి చేస్తున్న పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్కు భారత డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ వీజీ సోమని లేఖ రాశారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న గడువు తేదీ లేబుల్ను అతికించని మందు బుడ్డీ (వయల్)ల జీవితకాలాన్ని తొమ్మిది నెలలకు పొడిగించుకోవచ్చని పేర్కొన్నారు.
12-15 ఏండ్ల పిల్లలకూ సురక్షితమే: ఫైజర్
వాషింగ్టన్: పన్నెండు నుంచి పదిహేనేండ్ల మధ్య వయసున్న పిల్లల్లో తమ కరోనా టీకా 100 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు ఫైజర్ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 16 ఏండ్లుపైబడిన వారికే ఈ టీకాను అందిస్తున్నారు. పిల్లల్లో టీకా ప్రభావంపై క్లినికల్ ట్రయల్స్ సమాచారం అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. తాజా ఫలితాల నేపథ్యంలో 12-15 ఏండ్ల మధ్యవారికి కూడా టీకా అందించేందుకు అత్యవసర అనుమతి కోసం అమెరికా, ఈయూ సంస్థలకు ఫైజర్ సంస్థ త్వరలోనే దరఖాస్తు చేయనున్నది. అమెరికాలో 12-15 ఏండ్ల వయసున్న 2,260 మందిపై ఫైజర్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. పెద్దల్లో కనిపించినట్టుగానే పిల్లల్లోనూ జ్వరం, నొప్పి, అలసట వంటి సాధారణ ప్రతికూల ప్రభావాలు మాత్రమే కనిపించినట్టు ఆ సంస్థ తెలిపింది. మరోవైపు ఆస్ట్రాజెనెకా బ్రిటన్లో 6-17 ఏండ్ల పిల్లలపై కూడా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నది.
ఇవి కూడా చదవండి:
గే న్యాయవాది.. హైకోర్టు జడ్జిగా ఉండొద్దా?
పాన్-ఆధార్ అనుసంధానం గడువు 3 నెలలు పొడిగింపు