డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్నది. శబ్ధ కాలుష్యానికి పాల్పడే వారిపై భారీగా జరిమానాలు వసూల్ చేయనున్నది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మతపరమైన ప్రదేశాల్లో, పెండ్లి వేడుకల్లో, వాహనాల వల్ల శబ్ధ కాలుష్యం కలిగితే భారీ జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. క్యాబినెట్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ శబ్ధ కాలుష్య నియంత్రణ చట్టం ప్రకారం నిర్ణయం తీసుకున్నామని, నిర్దేశిత డెసిబుల్ దాటి శబ్ధం వస్తే, అప్పుడు వాహనదారుడికి వెయ్యి రూపాయాలు జరిమానా విధిస్తామని, రెండోసారి ఉల్లంఘిస్తే 2500 జరిమానా విధిస్తామని, మూడవ సారి 5వేల ఫైన్ వేస్తామని ప్రభుత్వ ప్రతినిధి సుబోధ్ ఉనియాల్ తెలిపారు.
మతపరమైన ప్రదేశాల్లో ఒకవేళ హారన్ మోగిస్తే వారికి మొదటిసారి 5వేల ఫైన్ వేయనున్నారు. రెండోసారి పది వేలు, మూడోసారి 15వేల జరిమానా విధించనున్నారు. హోటళ్లు, రెస్టారెంట్ల వద్ద శబ్ధ కాలుష్యం చేస్తే, మొదటిసారి 10వేలు, రెండోసారి 15వేలు, మూడోసారి 20వేలు వసూల్ చేయనున్నారు. పారిశ్రామిక పనులు చేస్తున్న సమయంలో సౌండ్ పొల్యూషన్ ఎక్కువైతే అప్పుడు మొదటిసారి 20వేలు, రెండోసారి 30వేలు, మూడోసారి 40వేల జరిమానా విధించనున్నారు. శబ్ధ కాలుష్యానికి కారణమైన పరికరాలను కూడా సీజ్ చేయనున్నారు.