న్యూఢిల్లీ : గత వారం రోజుల్లో జరిపిన ఆర్టీపీసీఆర్ టెస్టుల వివరాలపై నివేదిక సమర్పించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్ట్ ఆదేశించింది. టెస్టుల సంఖ్య ఎందుకు తగ్గిందని ప్రశ్నించింది. కొవిడ్-19 రోగుల కోసం ఫీల్డ్ ఆస్పత్రుల ఏర్పాటులో సాయుధ దళాల సేవలను ఉపయోగించుకోవడాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్ట్ సూచించింది.
కొవిడ్-19 రోగులకు అవసరమైన అత్యవసర మందులు, ఆక్సిజన్ సిలిండర్లను నిల్వ చేయరాదని అవసరమైన వారికి అవి లభించేలా సహకరించాలని కోర్టు కోరింది. కొవిడ్-19 మహమ్మారితో తలెత్తిన సమస్యలు, ఆక్సిజన్ సంక్షోభంపై న్యాయస్ధానానికి సహకరించేందుకు సీనియర్ అడ్వకేట్ రాజ్ శేఖర్ రావును కోర్టు అమికస్ క్యూరీగా నియమించింది.