డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ కేదార్నాథ్ ఆలయం అర్చకులు ధర్నా చేశారు. ఆదివారం ఆలయం ఎదుట నిరసన తెలిపారు. చార్ ధామ్ దేవస్థానం బోర్డును రద్దు చేయాలని కేదార్నాథ్ తీర్థ్ పురోహిత్ సమాజ్ డిమాండ్ చేసింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం గత ఏడాది ఉత్తరాఖండ్ చార్ ధామ్ దేవస్థానం బోర్డు బిల్లును ఆమోదించింది. కాగా, జమ్ముకశ్మీర్లోని వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు, ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి బాలాజీ పుణ్యక్షేత్రం (టీటీడీ) బోర్డు తరహాలో అర్చకుల సాంప్రదాయ హక్కులను ఈ బిల్లు హరిస్తున్నదని, బోర్డును ప్రభుత్వం తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నదని అర్చకులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ చార్ ధామ్ దేవస్థానం బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత రెండు నెలలుగా అర్చకులు నిరసనలు తెలుపుతున్నారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని కోరుతూ రక్తంతో రాసిన లేఖను కూడా పంపారు.
మరోవైపు, కరోనా నేపథ్యంలో చార్ ధామ్ యాత్రను బోర్డు గత రెండేండ్లుగా రద్దు చేసింది. దీంతో కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్ ఆలయాలకు భక్తుల తాకిడి లేక అర్చకులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.