డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్ నాలుగు నెలల్లోనే తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభాన్ని నివారించడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. గఢ్వాల్ ఎంపీ అయిన తీరథ్ సింగ్ రావత్ అనూహ్యంగా మార్చి 10న తివేంద్ర సింగ్ రావత్ స్థానంలో కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే కాని ఆయన ఎంపీగానే కొనసాగుతున్నారు. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వారు ఆరు నెలలలోపు రాష్ట్ర అసెంబ్లీ లేదా శాసన మండలికి ఎన్నిక కావాల్సి ఉంటుంది. కాగా, ఉత్తరాఖండ్కు శాసన మండలి లేదు. ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు తీరథ్కు సెప్టెంబర్ 10 వరకు గడువు ఉన్నది. రాష్ట్రంలోని గంగోత్రి, హల్ద్వానీ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగాల్సి ఉన్నది. అయితే కరోనా పరిస్థితుల్లో ఈ ఏడాది నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించడంపై ఈసీ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు చాలా తక్కువ.
దీంతో సెప్టెంబర్ 10లోగా సీఎం తీరథ్ సింగ్ రావత్ అసెంబ్లీకి ఎన్నిక కాకపోతే ఆ రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది. మరోవైపు వచ్చే ఏడాది ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్లో నెలకొన్న ఈ అనిశ్చితిని తొలగించేందుకు కొత్త సీఎంను నియమించాలని బీజేపీ యోచిస్తున్నది. ఈ క్రమంలో సీఎం తీరథ్ సింగ్ రావత్ శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి తన రాజీనామా లేఖను ఇచ్చినట్లు తెలుస్తున్నది. అనంతరం రాజీనామా సమర్పణకు ఉత్తరాఖండ్ గవర్నర్ అపాయింట్మెంట్ను కూడా ఆయన కోరినట్లు సమాచారం.