న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విస్తరణ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ వస్తున్న రాష్ట్రాలు.. ఇప్పుడు ఆ పరీక్షలను పూర్తిగా రద్దు చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఈ ఏడాదికి 12వ తరగతి పరీక్షలను రద్దు చేశాయి. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ఈ ఏడాదికి 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గకపోవడంతో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గత రాత్రి ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇవాళ పలు రాష్ట్రాలు ఆయా బోర్డుల పరిధిలోని 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నాయి.