డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం గృహ వినియోగదారులకు ఉచిత, రాయితీ విద్యుత్ పథకాన్ని గురువారం ప్రకటించింది. వంద యూనిట్ల వరకు విద్యుత్ ఉచితమని, ఎలాంటి చార్జీలు ఉండవని ఆ రాష్ట్ర విద్యుత్ మంత్రి హరక్ సింగ్ రావత్ తెలిపారు. వంద నుంచి 200 యూనిట్ల విద్యుత్ వినియోగదారులకు నెలకు 50 శాతం రాయితీ ఇస్తామన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రెండు నెలలకు ఒకసారి విద్యుత్ బిల్లులు ఇస్తారని, అయినప్పటికీ నెలవారీ యూనిట్ల ప్రకారం విద్యుత్ వినియోగదారులకు లబ్ధి కలుగుతుందని మంత్రి హరక్ సింగ్ రావత్ వివరించారు. రెండు నెలలకు కలిపి 200 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.
ఇప్పటి వరకు వాణిజ్య కేటగిరీలో ఉన్న పాడి, ఉద్యాన, వ్యవసాయ రంగాలను గృహ వినియోదారుల కేటగిరీ కిందకు మార్చినట్లు హరక్ సింగ్ రావత్ చెప్పారు. ఆయా రంగాలకు కూడా ఈ ఉచిత, రాయితీ విద్యుత్ స్కీమ్ వర్తిస్తుందని వెల్లడించారు. కాగా, ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునేందుకు ఈ ఉచిత, రాయితీ విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి.