డెహ్రాడూన్: ఒక అంబులెన్స్ డ్రైవర్ పెండ్లి ఊరేగింపులో డాన్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆసుపత్రులకు కరోనా రోగుల తాకిడి బాగా పెరిగింది. దీంతో విరామం లేక వైద్య సిబ్బంది, అంబులెన్స్ డైవర్లు ఒత్తిడికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలోని సుశీలా తివారీ ఆసుపత్రిలో పని చేసే మహేశ్ అనే అంబులెన్స్ డ్రైవర్ పెండ్లి ఊరేగింపు బాజాలు విని తనలోని ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. పీపీఈ కిట్ ధరించి ఉన్న అతడు వెంటనే ఆసుపత్రి బయటకు వచ్చాడు. పెండ్లి ఊరేగింపు వారితో కలిసి డ్యాన్స్ చేశాడు. ఆ విధంగా పని ఒత్తిడి నుంచి కాస్త ఊరట పొందాడు.
పెండ్లి ఊరేగింపులోని ఒకరు మహేశ్ డ్యాన్స్ను వీడియో తీశారు. దీనిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా వైరల్ అయింది. మరోవైపు ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. పని ఒత్తిడి నుంచి ఊరట కోసం అంబులెన్స్ డ్రైవర్ మహేశ్ డ్యాన్స్ చేయడాన్ని కొందరు అభినందించారు. అయితే పీపీఈ కిట్ ధరించి ఉన్న అతడి ద్వారా పెండ్లిలోని వారికి కరోనా సోకే ప్రమాదముందని మరి కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.