డెహ్రాడూన్: మత ప్రదేశాల గౌరవాన్ని కాపాడేందుకు ‘మిషన్ మర్యాద’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. పవిత్ర పుణ్య క్షేత్రాల వద్ద అగౌరవంగా, అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఇటీవల గంగా నది స్నానాల ఘాట్ వద్ద కొందరు పర్యాటకులు హుక్కా తాగారు. ఇది చూసిన స్థానికులు వారిని చితక బాదారు. ఈ నేపథ్యంలో పుణ్య క్షేత్రాల వద్ద మద్యం సేవించడం, హుక్కా తాగడం, డ్రగ్స్ వాడకం వంటి చర్యలను నిరోధించేందుకు ‘మిషన్ మర్యాద’ను అమలు చేస్తున్నట్లు డీజీపీ అశోక్ కుమార్ చెప్పారు. ఉత్తరాఖండ్ దేవ భూమి అని, ఇలాంటి అమర్యాద చర్యలు ఇక్కడ చేయకూడదని అన్నారు. కన్వర్ యాత్రను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిందన్న ఆయన, భక్తులు హరిద్వార్కు రావద్దని సూచించారు. పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు రాకుండా శివారు ప్రాంతాల్లో పోలీస్ బలగాలను మోహరించినట్లు డీజీపీ వెల్లడించారు.