క్రెడిట్ లేదా డెబిట్ కార్డు బ్లాక్ అవుతుంది.. కేవైసీ అప్డేట్ చేయాలంటూ ఓటీపీ చెప్పమంటారు. నిజమేనని చెప్పగానే క్షణాల్లో బ్యాంకు ఖాతాలో డబ్బు మాయమవుతుంది. మేము ఆర్మీ అధికారులం. తక్కువ ధరకే వస్తువులు ఇస్తాం. కావాలంటే గూగుల్ పే, ఫోన్పే చేయండి అంటూ ఆర్మీ సెంటిమెంట్ చూపించి వంచన. మీకు అమ్మాయితో పరిచయం కావాలని ఉందా? ఏకాంతంగా గడపాలని ఉందా? అని మెస్సేజ్లు వస్తుంటాయి. వెంటనే స్పందించి ఫోన్లు చేస్తే తొలుత రిజిస్ట్రేషన్ ఫీజు, ఆ తర్వాత అమ్మాయిలతో మాట్లాడించి అందినకాడికి లాగేస్తుంటారు. ఉచితం, తక్కువ ధరలు, గిఫ్ట్ల పేరుతో ఆగడాలు అప్డేట్, లాటరీ అంటూ డబ్బు మాయం సాంకేతికత అనూహ్యంగా పెరగడంతో అదేస్థాయిలో సైబర్ మోసాలు పెచ్చరిల్లుతున్నాయి. అమాయకత్వం, అత్యాశ, పక్కవారితో చర్చించకపోవడం, సులువుగా వస్తుందనే ధోరణి, సెంటిమెంట్లు గుడ్డిగా నమ్మి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి విలవిలలాడుతున్నారు. ఏదీ కష్టపడకుండా రాదనే విషయాన్ని విస్మరించి అతి సులువుగా మోసపోతున్నారు. ఇలా మోసపోయి, జేబులు గుల్ల చేసుకుంటున్న వారిలో యువతతోపాటు ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులు ఉంటుండడం సైబర్ నేరాల పెరుగుదలకు పరాకాష్ట. ఏదీ ఊరికే రాదు.. కష్టపడకుండా డబ్బు వస్తుందనే ఆశ నుంచి బయటపడ డం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
సాంకేతికత ఏ స్థాయిలో పెరిగిందో.. దానిని ఆధారం చేసుకొని అదే రీతిలో నేరాల సంఖ్య సైతం రెట్టింపవుతున్నది. కొంచెం కంప్యూటర్ పరిజ్ఞానం..మాయమాటలతో కూర్చున్న చోట నుంచే అంతర్జాల ఆగంతకులు కోట్లు కొల్లగొడుతూ.. ఖాతాలు సున్నా చేస్తున్నారు. ఇందులో బాధితుల పొరపాట్లే ఎక్కువ ఉంటున్నాయి. అందులోనూ చదువుకున్న వాళ్లే మోసపోవడం దిగ్భ్రాంతి పరిచే అంశమే. అవగాహన లోపంతో కొందరు.. అత్యాశకు పోయి మరికొందరు..సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుకొని తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే మనం కాస్త అప్రమత్తతతో వ్యవహరిస్తే..మోసాన్ని గ్రహించవచ్చు. కేటుగాళ్ల వలలో పడకుండా.. తప్పించుకోవచ్చు. ముప్పును చాకచక్యంతో ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన విధానాలు ఏమిటో తెలుసుకుందాం
బ్యాంకింగ్ అధికారులెవరూ.. ఫోన్ చేసి మీ వివరాలు అడుగరు. అలా ఎవరైనా చేశారంటే.. బ్యాంకుకు వచ్చి చెబుతామంటూ.. కాల్ కట్ చేయాలి. ఓటీపీ అనేది సీక్రెట్గా ఉండాల్సింది. అలాంటిది ఫోన్లో అడిగే వారికి ఎలా చెబుతారు. ఓటీపీ చెప్పేస్తే..డబ్బు సైబర్నేరగాళ్ల చేతిలోకి వెళ్తుంది. ఒకవేళ మోసపోతే బ్యాంకు కస్టమర్ కేర్కు ఫోన్ చేసి, కార్డు బ్లాక్ చేయించి, సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీ ఫోన్లో ఫలానా యాప్ను డౌన్లోడ్ చేసుకోమని చెప్పారంటే అది మోసమని అనుమానించాలి. రిమోట్ యాప్లను ఉపయోగించి మీ ఖాతాలు ఖాళీ చేశారంటే ..వెంటనే బ్యాంకుకు ఫోన్ చేసి ఖాతాను స్తంభింప చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
బ్యాక్డోర్ నుంచి ఉద్యోగాలు సంపాదించాలనుకుంటే అది ఎప్పటికైనా ప్రమాదమనే విషయాన్ని గుర్తించాలి. జాబ్ పోర్టల్స్ తమ డేటాను జాబ్ కన్సల్టెన్సీలకు విక్రయిస్తుంటాయి. అవి ఇంటర్వ్యూలు చేసి ఉచితంగా ఉద్యోగాలు ఇప్పిస్తుంటాయి. ఇది చేసినందుకు ఆయా కన్సల్టెన్సీలకు, జాబ్ ఇచ్చిన సంస్థలు కమీషన్ ఇస్తాయి. టాలెంట్ ఉన్న మానవ వనరులను ఆయా సంస్థలకు ఇవ్వడం కన్సల్టెన్సీల పని. కానీ ఉద్యోగం ఇప్పిస్తామంటూ ముందుగా డబ్బులు వసూలు చేసే వారు మోసం చేసే వారేనని గుర్తించుకోండి.
కస్టమర్ కేర్కు ఫోన్ చేసే సమయంలో మనం చేస్తున్న నంబర్ నిజమైందా? కాదా? అని నిర్ధారించుకోవాలి. ప్రతి కంపెనీ, ఆన్లైన్ ఫ్లాట్ ఫామ్స్ కాంటాక్టు నంబర్లు, ఆయా సంస్థల కస్టమర్ కేర్ నంబర్లు వాళ్ల తమ వెబ్సైట్లలో ఉంచుతారు. దానిని పరిశీలించుకోవాలి. తెలియకపోతే తెలిసిన వారిని అడిగి తెలుసుకోవడం మంచిది.
ఎక్కడ కూడా అసాధారణ లాభాలు రావు. కష్టపడితేనే లాభాలు వస్తాయి. ఇంటర్నెట్లో ముక్కు ముఖం తెలియని వాళ్లు వేసే ప్రకటనలు చూసి గుడ్డిగా నమ్మవద్దు. ఎక్కడైనా పెట్టుబడి పెడుతున్నారంటే ముందుగా ఏ కంపెనీలో పెడుతున్నారు? ఏ కంపెనీ షేర్స్కొంటున్నారు.. అనే విషయాలను పరిశీలించుకోవాలి.
అమ్మకాలు, కొనుగోళ్ల విషయంలో సైబర్నేరగాళ్లు బాధితుల అత్యాశ, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మోసం చేస్తున్నారు. ప్రకటన రాగానే వస్తువు ఎక్కడుంది, వాహనం అయితే దాని నంబర్ ఏమిటీ అనేది పరిశీలన చేయకుండానే భేరం చేస్తుంటారు. వస్తువును చూసిన తరువాత, దానిని అమ్మే వ్యక్తి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడో నిర్ధారించుకున్న తరువాతే ఆర్థికపరమైన లావాదేవీలు చేయాలి. ఎక్కువగా రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలో ఇలాంటి మోసాలు చేసే ముఠాలు ఉన్నాయి. క్యూఆర్ కోడ్ పంపించే సమయంలో డబ్బు చెల్లిస్తున్నామా? మన ఖాతాలో డిపాజిట్ అవుతున్నదా? అనే విషయాన్ని పరిశీలించుకోవాలి.
తమ స్నేహితుడు ఆపదలో ఉన్నాడని.. డబ్బులు కావాలని నకిలీ ఖాతాల ద్వారా నేరగాళ్లు వల వేస్తారు. అలాంటప్పుడు స్నేహితుడికి ఫోన్ చేసి నీ పేరుతో ఇలా వచ్చింది, నిజమా? కాదా? అని నిర్ధారించుకోవాలి. అలా చేయడంతో స్నేహితుడికి కూడా తన పేరుతో నకిలీ ఖాతాలు ఉన్నాయనే విషయం తెలుస్తుంది. ఇతరులను అప్రమత్తం చేస్తాడు.
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో నకిలీ ఖాతాలు తెరిచి యువతులను కొందరు బ్లాక్మెయిల్ చేస్తుంటారు. ఎక్కువగా తెలిసిన వారే ఇలాంటి పనులు చేస్తుంటారు. ఆ సమయంలో వెంటనే బాధితులు సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అమ్మాయిగా చెప్పుకునే సైబర్నేరగాళ్లు అర్ధనగ్నంగా, నగ్నంగా చాటింగ్ చేసినట్లు వీడియోలు చూపిస్తారు. బాధితుడు కూడా అలాగే చేయగానే వీడియోలు తీస్తారు. వాటిని సోషల్మీడియాలో పెడుతామంటూ బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తారు.
తెలిసిన వారు బ్లాక్మెయిలింగ్ చేస్తే అది వాళ్లు ఇతర కారణాలతో చేస్తున్నారనే విషయం స్పష్టమవుతుంది. సైబర్నేరగాళ్లు చేసే బ్లాక్మెయిలింగ్లో ఆర్థిక ప్రయోజనాలు ఒక్కటే ఉంటాయి. వారు డబ్బులు ఇచ్చే వాళ్లు ఎవరు అనే విషయాన్ని గుర్తిస్తారు. ఒక్కసారి భయపడ్డారంటే అందిన కాడికి లాగేసేందుకు ప్రయత్నిస్తుంటారు. పరువుతో కూడుకున్న విషయం కావడంతో కొందరు భయపడి నేరగాళ్లకు డబ్బులు ఇస్తుంటారు. బెదిరింపులకు భయపడకుండా పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయాలి.
కంప్యూటర్లలో వైరస్ చొరబడకుండా ఉండాలంటే యాంటీ వైరస్లు పటిష్టంగా ఉండాలి. కంప్యూటర్లో ఉపయోగించే పాస్వర్డ్ బలంగా ఉండి, వాటిని తరచూ మారుస్తుండాలి. ర్యాన్సమ్ వేర్ అటాక్స్కు బెదిరిపోకూడదు. సైబర్నేరగాళ్లు ఎక్కువగా డబ్బు వచ్చే దగ్గరే సమయాన్ని వెచ్చిస్తారు. మనం డబ్బు ఇవ్వమని తెలిస్తే పట్టించుకోరు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ను కూడా ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి.
ఫోన్లు చేసి మీ పాలసీలు క్లెయిమ్ చేసుకోవాలంటూ.. నమ్మించే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా సీనియర్ సిటిజన్స్ను మోసగాళ్లు లక్ష్యంగా చేసుకుంటారు. వాళ్లు ఎక్కువగా బ్యాంకులకు, ఇన్సూరెన్స్ సంస్థలకు తిరగలేరు, వృద్ధాప్యంలో డబ్బులు వస్తాయనే ఆశను నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. బీమా సంస్థల నుంచి ఫోన్ వచ్చిందంటే ఆయా సంస్థలకు సంబంధించిన కస్టమర్ కేర్, బ్రాంచ్ నంబర్లకు ఫోన్ చేసి వివరాలు అడగాలి.
రూ. 25 లక్షల లాటరీ వచ్చింది.. క్లెయిమ్ చేసుకోవాలంటే ప్రభుత్వానికి పన్నులు చెల్లించాలంటూ బురిడీ కొట్టిస్తారు. ఒకటేమిటి వివిధ రకాలైన లాటరీలు వచ్చాయంటూ.. సెల్ఫోన్లకు మెసేజ్లు, ఈ-మెయిల్స్ పంపిస్తారు. వాటికి స్పందించి ఫోన్లు చేస్తే.. ఆన్లైన్ సైట్లో షాపింగ్ చేశారు. ఆ సంస్థ లాటరీ తీయడంతో ప్రైజ్ వచ్చిందని నమ్మిస్తారు.
వెయ్యి రూపాయల షాపింగ్ చేస్తే రూ. 25 లక్షల లాటరీ వచ్చిందంటే గుడ్డిగా నమ్మేవాళ్లున్నారు. లాటరీలు లేవనే విషయాన్ని నమ్మాలి. అలాంటి మెసేజ్లకు స్పందించకుండా ఉండటం మంచిది.
అత్యాశ, అమాయకత్వమే సైబర్నేరగాళ్లకు కలిసి వస్తున్నాయి. సైబర్మోసాలు చేసే వారు తెలియవైన వారు కాదు. ఎక్కువగా చదువుకున్న వాళ్ల్లే బాధితులుగా ఉంటున్నారు. అయినా మోసానికి గురవుతున్నారు. డబ్బు వస్తుందంటే అత్యాశకు పోయి తాము ఏం చేస్తున్నామనే విషయాన్ని కనీసం కుటుంబసభ్యులతోనూ షేర్ చేసుకోని వారుంటున్నారు. ఆర్థికపరమైన లావాదేవీలు జరిపే సమయంలో ఒకసారి కుటుంబసభ్యులతో చర్చించడం మంచిది. కష్టపడకుండా డబ్బులు రావు. ఈజీ మనీ కోసం ఆశపడి కష్టపడింది పొగొట్టుకోవద్దు. – కేవీఎం ప్రసాద్, ఏసీపీ,హైదరాబాద్ సైబర్క్రైమ్స్
సైబర్నేరాలను అవగాహనతో అధిగమించవచ్చు. గిప్ట్లు, ఇన్సూరెన్స్, చారిటీ, అయిల్స్, పెట్టుబడుల పేరుతో వచ్చే ఆఫర్లు ఎంత వరకు నిజం అనేది ఆలోచించాలి. దానిపై తెలిసినవారితో చర్చించుకోవాలి. గుడ్డిగా నమ్మేసి సైబర్నేరగాళ్లు చెప్పే మాటలతో మోసపోవద్దు. ఇతరులకు తెలిస్తే నాకు వచ్చే లాభం పోతుందేమో, భారీగా లాభాలు వచ్చిన తరువాత అందరికీ చెప్పాలనే ధోరణిలో ఉంటారు. ఆ ధోరిణి నుంచి బయటకు వచ్చి ఆలోచించాలి. ఏదీ కూడా ఊరికేరాదు, కష్టపడకుండా డబ్బు వస్తుందనే ఆశ నుంచి బయటపడాలి. – హరినాథ్, ఏసీపీ, రాచకొండ సైబర్క్రైమ్స్