కుటుంబ కలహాలతో కూతురు హత్య
ఆర్డీవో విచారణలో వెలుగులోకి దారుణం
నిందితుడి అరెస్టు
పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 16: అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిని కన్నతండ్రే కడతేర్చాడు. భార్యపై కోపంతో దారుణంగా హతమార్చాడు. ఆపై తప్పించుకునేందుకు యత్నించగా, పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దపల్లి ఎస్ఐ రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రంలోని కొర్రాపూర్ జిల్లా మైదాల్పూర్ గ్రామానికి చెందిన అరుణ్ హరిజన్- కీరోదీప్ హరిజన్కు ఏడేళ్ల కొడుకు సాగర్, నాలుగేళ్ల హెలినా హరిజన్ ఉన్నారు. ఈ దంపతులు నాలుగేళ్ల నుంచి పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేటలోని ఇటుక బట్టీల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. కొద్దిరోజులుగా వీరు ఆర్థిక పరమైన ఇబ్బందులతో గొడవ పడుతున్నారు. ఇదే విషయంలో గురువారం కూడా స్వల్పంగా గొడవ పడ్డారు. అది కాస్తా కూతురు హత్యకు దారి తీసింది. భార్యపై కోపంతో ఆవేశానికి లోనైన అరుణ్, తన బిడ్డను ఇంటి ఆవరణలో ఉన్న తాడుతో ఉరేసి, గట్టిగా నులిమి చంపాడు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా దాచేందుకు ప్రయత్నించాడు. గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రకాశ్ ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారి మృతదేహాన్ని పరిశీలించిన వైద్యులు, అనుమానాలు వ్యక్తం చేశారు. శుక్రవారం పోస్ట్మార్టం రిపోర్టు రాగా, మెడకు ఉరిపడి చనిపోయినట్లు వెల్లడైంది. ఈ ఘటనపై పెద్దపల్లి ఆర్డీవో శంకర్ కుమార్ నేతృత్వంలో జిల్లా కార్మికశాఖ అధికారి రాజలింగం, డీపీపీవో జితేందర్, ఆర్ఐ వరలక్ష్మి, పోలీసులు శుక్రవారం విచారణ చేపట్టారు. బట్టీలోని తోటి కార్మికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. లోతుగా విచారణ చేయడంతో ఈ కిరాతకం బయటకు వచ్చింది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, భార్యపై కోపంతోనే అరుణ్ తన కూతురును చంపినట్లు తేలింది. తర్వాత నిందితుడు అరుణ్ కూడా ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.
ఇవి కూడా చదవండి
బీజేపీ విజ్ఞప్తికి టీఆర్ఎస్ సానుకూల స్పందన
చందూలాల్ మృతిపట్ల హోంమంత్రి సంతాపం