కరోనా ఎందరో అమాయకులను బలి తీసుకుంది. దొరికిందే అవకాశమన్నట్టు ప్రైవేటు హాస్పిటల్స్ అందినంతా దోచుకున్నాయి.వచ్చిందే గిరాకీ అని ప్రైవేటు డాక్టర్లూ ఎంతోకొంత దాచుకున్నారు.బిల్లుల తీరును చూసి బీద ప్రజలు బిక్కుబిక్కుమన్నారు. కానీ, అందరు వైద్యులూ ఒకేలా ఉండరు కదా? సేవా తత్పరులూ ఉంటారు.అలాంటివారిలో డాక్టర్ సుజీత్ ఒకరు!
కరోనా మహమ్మారి విజృంభించడంతో.. ఇదే అదనుగా ప్రైవేటు హాస్పిటల్స్ బిల్లుల మోత మోగించాయి. సామాన్యుల జీవితాలతో చెలగాటమాడాయి. వైద్య వ్యాపారులు రాజ్యమేలుతున్న ఆ సమయంలో ‘భయపడకండి.. మీకు నేనున్నాను’ అంటూ భరోసా కల్పించారు డాక్టర్ సుజీత్. హైదరాబాద్కు చెందిన సుజీత్ కుమార్ ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ సర్జన్గా పని చేస్తున్నారు. కొవిడ్వల్ల వేలాదిమంది దవాఖాన పాలై పోవడం చూసి, చలించిపోయారు. తాను అందరిలా ఉండొద్దని అనుకున్నారు. లక్షల రూపాయలు చెల్లించుకోలేని, అసలు డబ్బులే లేని పేదలకు ఉచితంగా కరోనా చికిత్స అందించాలని నిర్ణయించుకున్నారు. మొదట ఒక రోగికి ఉచితంగా చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. చికిత్స తీసుకున్న ఆ వ్యక్తి డాక్టర్ గురించి, అతడి వైద్యం గురించి నలుగురికీ చెప్పడంతో సుజీత్కు వరుసగా కాల్స్ మొదలయ్యాయి. ఎలాంటి ప్రకటనా లేకుండానే నోటిమాట ద్వారా మంచితనపు పరిమళం విస్తరించింది. కరోనా రోగులు సంప్రదించడం షురూ అయ్యింది.
500 మందికి పైగా..
పరిస్థితులు మారడం, రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు సుజీత్. ప్రతీ రోగిని రోజుకు మూడుసార్లు పర్యవేక్షించాలని అనుకున్నారు. రోగులు వాట్సప్ద్వారా ఆక్సిజన్ స్థాయిలు, ఉష్ణోగ్రత వంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తనకు పంపే అవకాశం కల్పించారు. రోజుకు ఏడు నుంచి పది మంది రోగులు సంప్రదించేలా ఏర్పాట్లు చేశారు. తనను ఆశ్రయించిన అందరికీ చికిత్స చేయాలనుకున్నారు. వేవ్-1 నుంచి మొదలైన సుజీత్ ఉచిత కరోనా చికిత్స ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రతీ రోగిని బతికించడం తన బాధ్యతని ఫీలవుతారాయన. సుజీత్ చికిత్స అందించిన రోగులలో చాలామంది రెండు వారాల్లోనే కోలుకొన్నారు. ఇప్పటి వరకూ 500 మందికిపైగా చికిత్స చేశారు.
అవగాహన కూడా
తనను సంప్రదించిన ఎంతోమందికి డాక్టర్ సుజీత్ కరోనాపట్ల అవగాహన కల్పించారు. కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ వచ్చాక తీవ్రతరం కాకుండా ఎలా ఉండాలి? అన్నది మనసుకు హత్తుకునేలా చెబుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభించక ముందే ‘సుజీత్ ఫౌండేషన్’ను ఏర్పాటు చేసి, ఆరోగ్యంపై ప్రజలకు చైతన్యం కల్పిస్తున్నారు. ఏ చికిత్స అయినా ఖర్చులు అధికంగా ఉంటున్నాయి. లక్షల రూపాయలు ఖర్చు చేయకుండా హాస్పిటల్నుంచి బయటకు రావడం అంత సులభం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో వృత్తిపరంగా, ఫౌండేషన్ పరంగా ప్రజలకు అండగా ఉండి భరోసా కల్పిస్తున్నారు సుజీత్. నామ మాత్రపు ఫీజుతో పేదలకోసం ఒక హాస్పిటల్ నిర్మించాలన్నది అతడి కల.
సుజీత్ ఫౌండేషన్ క్లినిక్
డాక్టర్ సుజీత్ సోమవారం నుంచి శుక్రవారం వరకు మణికొండలోని సుజీత్ ఫౌండేషన్ క్లినిక్లో ఫ్రీ కన్సల్టింగ్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ‘పాఠశాల స్థాయినుంచే విద్యార్థులను ఆరోగ్యం పట్ల అప్రమత్తం చేస్తే భవిష్యత్లో ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చు’ అనేది అతడి భావన. అందుకే, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అవసరమైన ఔషధాలు అందిస్తున్నారు. ఆ కృషిని ఎంతోమంది ప్రశంసిస్తున్నారు. పేదల డాక్టర్గా ముద్ర పడిన సుజీత్ సేవల్ని గుర్తించిన సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తాను బతికున్న కాలంలో, సుజీత్ ఫౌండేషన్కు రూ.3.26 లక్షల విలువైన వైద్య పరికరాలను విరాళంగా ఇచ్చారు. ‘వైద్యం వ్యాపారమో, ఉద్యోగమో కాదు. ఒక సామాజిక బాధ్యత‘ అని భావిస్తారు డాక్టర్ సుజీత్.
తక్కువ ఖర్చుతో..
కరోనా పట్ల ప్రజలు భయాందోళనలకు గురైన సమయంలో హాస్పిటల్స్ డబ్బులు దండుకోవాలని చూశాయి. అప్పులు చేసైనా ప్రాణాలు కాపాడుకోవాలని ప్రజలు అనుకుంటున్న పరిస్థితుల్లో నేను వారికి దగ్గరయ్యాను. ముఖ్యంగా కరోనాపట్ల ఉన్న భయాన్నిపోగొడుతున్నాను. కరోనాకంటే
ముందునుంచే సుజీత్ ఫౌండేషన్ ద్వారా పేదలకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నాను. పరీక్షలు కూడా 30% కన్నా తక్కువ వ్యయంలోనే చేస్తున్నాను.
-డాక్టర్ సుజీత్