లక్నో: వచ్చే ఏడాది ప్రథమార్థంలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అక్కడి యువతపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలోని కోటి మంది యువతకు ఉచితంగా స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు అందించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర యువత డిజిటల్ సాధికారిత కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. బుధవారం యూపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సప్లిమెంటరీ బడ్జెట్పై చర్చకు సమాధానం ఇస్తూ యూపీ సీఎం యోడీ పై హామీలు గుప్పించారు.
ముఖ్యమంత్రి సమాధానం అనంతరం రూ.7,301 కోట్ల సప్లిమెంటరీ బడ్జెట్కు మూజువాణి ఓటుతో ఆమోదముద్ర పడింది. అంతకుముందు అసెంబ్లీ మాట్లాడిన యూపీ సీఎం.. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర యువతను అస్సలు పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. దాంతో వారు బలవంతంగా అనైతిక కార్యకలాపాలకు పాల్పడి జైలు పాలయ్యేవారని చెప్పారు. కానీ బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర యువత అభివృద్ధిని కోరుకుంటున్నదని చెప్పారు.
ఉత్తరప్రదేశ్లో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేకపోవడంవల్ల గతంలో రాష్ట్ర యువత ఇండ్ల నుంచి బయటికి రావాలంటేనే బయపడేవారని, కానీ, ఇప్పుడు దేశంలో ఎక్కడికైనా వెళ్తున్నారని, తాను యూపీకి చెందిన వ్యక్తిని అని గర్వంగా చెప్పుకుంటున్నారని యోగీ ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్ర యువతలో డిజిటల్ సాధికారతను కోరుకుంటున్నదని, తాజా బడ్జెట్లో రూ.3,000 కోట్లు యువత కోసమేనని చెప్పారు.