ముంబై : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో తన భేటీపై వచ్చిన వదంతులను మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తోసిపుచ్చారు. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత శరద్ పవార్ ను ఆయన నివాసంలో కలిశానని ఫడ్నవీస్ వారిద్దరూ కలిసిఉన్న ఫోటోను ట్వీట్ చేశారు. మర్యాదపూర్వకంగానే తాను పవార్ ను కలిశానని ఫడ్నవీస్ పేర్కొన్నారు. గాల్ బ్లాడర్ సర్జరీ అనంతరం శరద్ పవార్ (80) ఇటీవల కోలుకున్నారు. తమ భేటీ సందర్భంగా పవార్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశానని ఫడ్నవీస్ తెలిపారు.
ఇక ఇద్దరు దిగ్గజ నేతల భేటీతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయని, వీరి కలయికకు రాజకీయ ప్రాధాన్యత ఉందని ఊహాగానాలు రేకెత్తాయి. మరోవైపు విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు మహారాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లపై మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించిన నేపథ్యంలో పవార్, ఫడ్నవీస్ ల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ తాను కేవలం మర్యాదపూర్వకంగానే శరద్ పవార్ తో సమావేశమయ్యానని ఫడ్నవీస్ వివరణ ఇచ్చారు.