50 ఏండ్ల ఘనచరిత్ర.. ప్రపంచంలోనే టాప్-2
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): కిటెక్స్ గ్రూప్నకు 50 ఏండ్లకుపైగా చరిత్ర ఉన్నది. కేరళకు చెందిన ఎంసీ జాకబ్ 1968లో కేరళలోని ఎర్నాకుళం జిల్లా కిజకంబళంలో ‘అన్నా కిటెక్స్ గ్రూప్’ను స్థాపించారు. మొదట్లో అల్యూమినియం ఉత్పత్తులు తయారుచేసేవారు. తర్వాత మసాలాలు, టెక్స్టైల్స్, స్కూల్, ట్రావెల్ బ్యాగ్స్.. ఇలా అనేక రంగాల్లోకి విస్తరించారు. 1992లో ఎంసీ జాకబ్ కుమారుడు సాబు ఎం జాకబ్ ‘కిటెక్స్ గార్మెంట్స్’ను స్థాపించారు. ఈ కంపెనీ తన ఉత్పత్తుల్లో 90 శాతం అమెరికా, యురోపియన్ యూనియన్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తుంది. ప్రధానంగా ‘లిటిల్ స్టార్’ బ్రాండ్ పేరుతో చిన్నపిల్లల దుస్తులను తయారుచేస్తున్నది. ఈ విభాగంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కంపెనీగా కిటెక్స్ గార్మెంట్స్ కొనసాగుతున్నది.
20% లాభపడిన కిటెక్స్ షేర్లు
తెలంగాణ ప్రభుత్వంతో కిటెక్స్ గార్మెంట్స్ లిమిటెడ్ ప్రతినిధులు పెట్టుబడుల చర్చలు జరుపుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆ సంస్థ షేర్ల విలువ ఒక్కసారిగా పెరిగింది. స్టాక్మార్కెట్లలో ఒక్కో షేర్ ఏకంగా 20 శాతం లాభపడటం గమనార్హం. నిజానికి అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) నష్టాల్లో ముగిసినా.. కిటెక్స్ షేర్లు మాత్రం మదుపరులను విపరీతంగా ఆకట్టుకోవడం విశేషం. ఈ క్రమంలోనే బీఎస్ఈలో 19.72 శాతం ఎగిసి రూ.140.55 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈలోనూ 19.97 శాతం ఎగబాకి రూ.140.85 వద్ద నిలిచింది. దీంతో రెండు సూచీల్లోనూ సంస్థ షేర్ విలువ 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. గురువారం కంపెనీ షేర్ విలువ బీఎస్ఈలో రూ.117.40 వద్ద, ఎన్ఎస్ఈలో రూ.117.75 వద్ద ముగిసింది.