నలుగురు సుప్రీంకోర్టు మాజీ జడ్జిల సూచన
న్యూఢిల్లీ, జూలై 24: చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా)తో పాటు దేశద్రోహం చట్టాన్ని రద్దు చేయాలని నలుగురు సుప్రీంకోర్టు మాజీ జడ్జిలు డిమాండ్ చేశారు. అసమ్మతిని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలను అణచివేయడానికే ఈ చట్టాలను సాధారణంగా ఉపయోగిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఫాదర్ స్టాన్ స్వామి మరణాన్ని రిటైర్డ్ జస్టిస్ అఫ్తాబ్ ఆలం ప్రస్తావించారు. ఉపా కింద అభియోగాలు ఎదుర్కొన్న 84 ఏండ్ల స్టాన్ స్వామికి బెయిల్ లభించని సంగతి తెలిసిందే. జాతీయ భద్రత, రాజ్యాంగ స్వేచ్ఛ- ఈ రెండు అంశాల్లోనూ ఉపా విఫలమైందని ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ ఆలం పేర్కొన్నారు. రిటైర్డ్ జస్టిస్లు దీపక్ గుప్తా, మదన్ బీ లోకూర్, గోపాల్ గౌడ కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఉపా, దేశద్రోహం చట్టాలను వ్యతిరేకించారు. ఇలాంటి కేసులో విచారణే శిక్షగా మారుతున్నదని జస్టిస్ లోకూర్ వ్యాఖ్యానించారు.