ఆగ్రా : యూపీ మహిళా కమిషన్ సభ్యురాలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాలికలకు మొబైల్ ఫోన్ లు ఇవ్వరాదని అవి వారిపై లైంగిక దాడులకు దారితీస్తాయని ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బాలికలను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని ఆమె తల్లితండ్రులకు విజ్ఞప్తి చేశారు. బాలికలు అబ్బాయిలతో ఫోన్లలో మాట్లాడుతూ ఆపై వారితో లేచిపోతారని యూపీ మహిళా కమిషన్ సభ్యురాలు మీనా కుమారి వ్యాఖ్యానించారు. అలీగఢ్ జిల్లాలో ఫిర్యాదుల బహిరంగ విచారణ సందర్భంగా బుధవారం ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో లైంగిక దాడులు విపరీతంగా పెరిగాయని ఒకరు ప్రశ్నించగా మీనా కుమారి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె అక్కడితో ఆగకుండా ముఖ్యంగా తల్లులు తమ కుమార్తెలపై కన్నేసి ఉంచాలని, తల్లుల నిర్లక్ష్యంతోనే మహిళలపై నేరాలు జరుగుతున్నాయని అన్నారు. ఆమె వ్యాఖ్యలు కలకలం రేపడంతో మీనా కుమారి ప్రకటనతో తమకు సంబంధం లేదని యూపీ మహిళా కమిషన్ స్పష్టం చేసింది. కుమారి వ్యాఖ్యలు అర్థరహితమని, బాలికలపై లైంగిక హింసకు వారికి మొబైల్ ఫోన్లు ఇవ్వకపోవడం పరిష్కారం కాదని కమిషన్ ఉపాధ్యక్షురాలు అంజూ చౌదరి పేర్కొన్నారు.