లక్నో: ఉత్తరప్రదేశ్కు చెందిన 45 ఏండ్ల గుడ్డీ అనే మహిళ, ఆమె ఐదుగురు పిల్లలు గత రెండు నెలలుగా ఆకలితో అలమటిస్తున్నారు. వారి దయనీయ పరిస్థితిని తెలుసుకున్న ఒకరు ఎన్జీవో సంస్థకు సమాచారం అందించారు. ఆ సంస్థ సభ్యులు ఆ కుటుంబాన్ని అలీగఢ్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం చేర్చారు. వారికి ఆహారం, పండ్లు, వైద్య సదుపాయాన్ని కల్పించారు.
గత ఏడాది లాక్డౌన్ కాలంలో తన భర్త చనిపోవడంతో 20 ఏండ్ల కుమారుడిపై తాము ఆధారపడినట్లు గుడ్డీ తెలిపింది. అయితే ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా పనులు లేవని, దీంతో సుమారు మూడు నెలలుగా తినడానికి తిండి లేక పస్తులుంటున్నట్లు ఆమె చెప్పింది. గ్రామ పెద్దను సహాయం కోరినా చేయలేదని, వంద రూపాయలు ఇమ్మని అడిగినా ఇవ్వలేదని ఆరోపించింది. రేషన్ షాపు డీలర్ను ఐదు కేజీల బియ్యం అడిగినా ఇవ్వలేదని చెప్పింది. ఎవరైనా ఏదైనా ఇస్తే తింటామని లేకపోతే పస్తులేనని వివరించింది.
మరోవైపు ఆ మహిళకు ఆధార్, రేషన్ కార్డు లేకపోవడంపై అలీగఢ్ జిల్లా కలెక్టర్ చంద్ర భూషణ్ సింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. ఆ మహిళకు తక్షణం రూ.5 వేల ఆర్థిక సహాయంతోపాటు అంత్యోదయ కార్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆధార్ కార్డుతోపాటు బ్యాంకు ఖాతాను తెరిచి ప్రభుత్వ సహాయాన్ని అందజేస్తామన్నారు.