హైదరాబాద్, ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ): నకిలీ విత్తనాలను అరికట్టడంతోపాటు నాణ్యతను పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. విత్తడానికి ముందే.. విత్తనం చరిత్రను తెలుసుకునే వెసులుబాటును రైతుకు కల్పిస్తున్నది. ఒక్కసారి స్కాన్చేస్తే చాలు విత్తనం పుట్టు పూర్వోత్తరాలన్నీ అరచేతిలో ఉంటాయి. అప్పుడే రైతు ఆ విత్తనాలను కొనాలా? వద్దా? అనేది నిర్ణయించుకోవచ్చు. దీనికి సంబంధించి దేశంలోనే తొలిసారిగా ఈ వానకాలం సీజన్ నుంచి తెలంగాణ విత్తనాభివృద్ధి, విత్తన ధ్రువీకరణ సంస్థ ‘సీడ్ ట్రేసబిలిటీ’ విధానాన్ని అమలు చేస్తున్నది. సీడ్ ట్రేసబిలిటీకి అవసరమైన సాఫ్ట్వేర్ను తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ సొంతంగా అభివృద్ధి చేసింది. సీడ్ ట్రేసబిలిటీ విధానంలో భాగంగా ప్రతి విత్తన ప్యాకెట్పై క్విక్ రెస్పాన్స్(క్యూఆర్) కోడ్ను ముద్రిస్తారు.
ఆ విత్తనాలను కొనుగోలు చేయాలనుకున్న రైతులు స్మార్ట్ఫోన్లో ఆ కోడ్ను స్కాన్ చేయగానే మొత్తం సమాచారం వస్తుంది. ఆ విత్తనాన్ని ఏ కంపెనీ ఆధ్వర్యంలో ఎక్కడ పండించారు, ఎక్కడ శుద్ధిచేశారు?నాణ్యతకు సంబంధించిన వివరాలు తెలుస్తాయి. ప్రతి విత్తన ప్యాకెట్పై తెలంగాణ విత్తన సంస్థ ధ్రువీకరించిన క్యూఆర్ కోడ్ను కచ్చితంగా ముద్రిస్తారు. ఈ సంస్థ పత్తి విత్తనాలు మినహా దాదాపు అన్ని రకాల విత్తనాలను ధ్రువీకరిస్తుంది. ఈ వానకాలంలో సుమారు 20 లక్షల క్వింటాళ్లకు పైగా విత్తన ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ను ముద్రించనున్నారు.
వానకాలానికి 20 లక్షల క్వింటాళ్లు సిద్ధం
వానకాలం సీజన్ సాగుకు అవసరమైన విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేసింది. మొత్తం 81 లక్షల ఎకరాలకు(పత్తి మినహా) అవసరమైన 20,04,220 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచింది. ఇందులో అత్యధికంగా వరి విత్తనాలు 19.52 లక్షల క్వింటాళ్లు, కంది 2,700 క్వింటాళ్లు, పెసర్లు 800 క్వింటాళ్లు, వేరు శనగ 36వేల క్వింటాళ్లు, ఆముదం 200 క్వింటాళ్లతో పాటు ఇతర విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి.
రైతుకు భరోసా
నకిలీ విత్తనాలను అరికట్టడంతో పాటు నాణ్యతను పెంచేందుకు సీడ్ ట్రేసబిలిటీ విధానాన్ని అమలు చేస్తున్నాం. దీని ద్వారా రైతుకు మనం సరఫరా చేసే విత్తనాలపై భరోసా, నమ్మకం కలుగుతుంది. ఏమైనా సందేహం ఉంటే స్కాన్ చేసి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.
-కే కేశవులు, తెలంగాణ విత్తన సంస్థ ఎండీ