లక్నో : ఉత్తరప్రదేశ్లో ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా మాడ్యుల్ గుట్టు రట్టయింది.లక్నోతో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో రద్దీ ప్రదేశాల్లో పేలుళ్లకు, ఆత్మాహుతి దాడులకు ఉగ్రవాదులు పన్నుతున్న కుట్రను యాంటీ-టెర్రరిస్ట్ స్కాడ్ (ఏటీఎస్) పోలీసులు భగ్నం చేశారు. అల్-ఖైదాకు అనుబంధ సంస్థ ‘అన్సర్ ఘజ్వత్-ఉల్-హింద్’కు చెందిన మినజ్ అహ్మద్, మసీరుద్దీన్ అనే ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. లక్నో శివారు ప్రాంతాల్లో వేర్వేరుచోట్ల ఉన్న వారి ఇండ్ల వద్ద నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, క్రూడ్ బాంబులుగా ఉపయోగించడానికి సిద్ధం చేసిన కుక్కర్లను స్వాధీనం చేసుకున్నారు. ‘అల్-ఖైదా యూపీ మాడ్యుల్కు నేతృత్వం వహిస్తున్న ఉమర్ హల్మంది ఆదేశాల ప్రకారం అహ్మద్, మసీరుద్దీన్ పనిచేస్తున్నారు. వీరిద్దరూ స్వాతంత్య్ర దినోత్సవానికి ముందే లక్నోతో పాటు ఇతర నగరాల్లోనూ దాడులకు కుట్రపన్నారు. ముఖ్య ప్రదేశాలు, రద్దీగా ఉండే చోట్ల పేలుళ్లు జరుపాలని, ఆత్మాహుతి దళాలనూ ఉపయోగించాలన్నది వారి పన్నాగం’ అని ఏడీజీపీ ప్రశాంత్కుమార్ తెలిపారు. అల్-ఖైదా మాడ్యుల్ లక్నోతోపాటు కాన్పూరులోనూ ఉన్నట్టు గుర్తించామన్నారు. ఉమర్ హల్మంది యువతను ఆకర్షించి అల్-ఖైదాలో చేర్పిస్తూ ఉగ్రదాడులకు పాల్పడేందుకు లక్నోలో నియమించుకున్న కొంతమందితో మాడ్యుల్ను ఏర్పాటుచేశాడని ఏడీజీపీ తెలిపారు.