హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వడివడిగా అడుగులు పడుతున్నాయి. శాఖల వారీగా పోస్టుల లెక్కలను అధికారులు బయటకు తీస్తున్నారు. ఉద్యోగ ఖాళీలపై ఆర్థికశాఖ ప్రత్యేకంగా అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్వోడీలతో ఆదివారం ఎంసీహెచ్ఆర్డీలో సమావేశం నిర్వహించింది. ఆర్థిక మంత్రి హరీశ్రావు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 32 ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల వివరాలను ఆయా శాఖల కార్యదర్శులు, హెచ్వోడీలు ఆర్థికశాఖకు అందించారు. ఆ వివరాలను ఆర్థికశాఖ మంగళవారం జరిగే మంత్రివర్గ సమావేశం ముందుంచనున్నది. 50 వేల ఉద్యోగాలను భర్తీచేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఇటీవల ప్రకటించటంతో పోస్టుల భర్తీపై కొంతకాలంగా శాఖలవారీగా కసరత్తు జరుగుతున్నది. తాజాగా ఆర్థికశాఖ పూర్తి వివరాలను సేకరించింది. పదోన్నతుల ద్వారా ఎన్ని ఖాళీలు భర్తీ చేయాలి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎన్ని భర్తీ చేయాలనే అంశాన్ని కూడా చర్చించినట్టు సమాచారం. అధికారులు అందించే నివేదికపై క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత పోస్టుల భర్తీకి సంబంధించిన వివరాలను టీఎస్పీఎస్సీకి అందిస్తారు. ఆ వెంటనే ఉద్యోగాల భర్తీకి కమిషన్ వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది.
కొత్త జోనల్ వ్యవస్థతో తొలగిన భయాలు
కొత్త జోనల్ వ్యవస్థ అమలులోకి రావటంతో ఉద్యోగాల భర్తీకి అడ్డంకులు తొలగిపోయాయి. స్థానికులకే ఉద్యోగాలన్నీ దక్కేలా నూతన జోనల్ వ్యవస్థ అమలులోకి వచ్చింది. ఓపెన్ కోటాలో స్థానికేతరులు వచ్చి చొరబడతారన్న భయం పోయింది. ఇతర ప్రాంతాలవారు కేవలం 5 శాతం ఓపెన్ కోటాకోసం వచ్చి పోటీపడే సాహసం కూడా చేయరని ఉద్యోగార్థులు భావిస్తున్నారు. రాష్ట్రస్థాయి పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయటమే కాకుండా గ్రూప్-1 పోస్టులను కూడా మల్టీ జోన్లోనే భర్తీ చేయనున్నారు. దీంతో నూటికి నూరు శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కే అవకాశమున్నది.