న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొద్ది రోజులు ఢిల్లీలో భారీగా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం టీకాలు వేస్తోంది. చాలా మంది జనం టీకా వేసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ను ప్రోత్సహించేందుకు ఉత్తర ఢిల్లీ మేయర్ జై ప్రకాశ్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. కొవిడ్ టీకా వేసుకుంటే ఆస్తిపన్నులో రీబేటు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
రాయితీ కోసం రెసిడెన్షియల్ హౌస్ యజమాని, అర్హత గల కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ మేరకు కార్పొరేషన్ ఆమోదం కోసం సర్క్యులర్ జారీ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు నివాస గృహాల యజమానులు, పన్ను చెల్లింపుదారులకు ఆస్తిపన్నులో అదనంగా 5శాతం రిబేటు ఇస్తామన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కాపీలు అందజేయాలని తెలిపారు. సర్క్యులర్ తక్షణం అమలులోకి వస్తుందని, జూన్ 30వ తేదీ వరకు మాత్రమే అవకాశం అందుబాటులో ఉంటుందని చెప్పారు.