ఆగ్రా: కాంగ్రెస్, ఎస్పీ లక్ష్యంగా యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ పార్టీలు ఇస్లామిక్ ఉగ్రవాదులతో మిత్రత్వం నెరుపుతాయని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా ఆరోపించారు. పేదలకు డబ్బు ఆశ చూపి మదర్సాలు మత మార్పిళ్లకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. ముస్లిం దేశాల నుంచి నేరుగా మతం మారిన పేదల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారని ఆరోపించారు. పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ తన హృదయం పాకిస్తాన్తో ఉంటుందని చెప్పడం పట్ల మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు.
అలాగైతే ఆమె పాకిస్తాన్ వెళ్లిపోవాలని సలహా ఇచ్చారు. పేదలు, దివ్యాంగుల ఖాతాల్లో ముస్లిం దేశాల నుంచి నగదు జమ చేయిస్తూ మదర్సాలు, స్వచ్ఛంద సంస్ధలు మత మార్పిళ్లను ప్రోత్సహిస్తున్నాయని మంత్రి విమర్శించారు. భయపెట్టి, ప్రలోభాలకు గురిచేస్తూ మతమార్పిళ్లకు పాల్పడటం రాజ్యాంగవిరుద్ధమని, ఈ వ్యవహారంపై యోగి ఆదిత్యానాధ్ ప్రభుత్వం, యాంటీ టెర్రర్ స్క్వాడ్ కఠిన చర్యలు చేపడతాయని హెచ్చరించారు. ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్, ఎస్పీ వంటి విపక్ష పార్టీలు పాకిస్తాన్ను బాహాటంగా సమర్ధిస్తున్నాయని మంత్రి శుక్లా ఆరోపించారు.