బందా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాందా జిల్లాలో ఓ విషాదకర ఘటన వెలుగుచూసింది. ప్రియురాలి ఇంటి పైకప్పుపై ఆమె ప్రియుడి మృతదేహం పడివుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. మెడపైన గాయాలతో ఇంటి టెర్రస్పై పడివున్న మృతదేహాన్ని గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం.. బాందా జిల్లాలోని అంబేద్కర్ నగర్కు చెందని కార్తీక్ సోని (25) అనే యువకుడు స్థానికంగా ఉన్న ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం యువతి తండ్రికి తెలియడంతో.. తన కూతురు జోలికి రావద్దని కార్తీక్ సోనిని హెచ్చరించాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి తన ప్రియురాలి ఇంటికి వెళ్లిన కార్తీక్ సోని.. ఆమె తండ్రితో గొడవకు దిగాడు.
ఆ తర్వాత ఏం జరిగిందో ఏమోగానీ తెల్లవారే సరికి కార్తీక్ సోని మృతదేహం యువతి ఇంటి టెర్రస్పై ప్రత్యక్షమైంది. మెడపై తీవ్ర గాయాలున్నాయి. స్థానికులు ఇది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు యువతి తండ్రిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేయడంవల్లే కార్తీక్ మృతిచెందినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు.