బాలీవుడ్ ఎమర్జింగ్ హీరో, ఈ మధ్యే కరోనా బారిన పడి కోలుకున్న కార్తీక్ ఆర్యన్కు చేదు అనుభవం ఎదురైంది. కరణ్ జోహార్కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న దోస్తానా 2 మూవీ నుంచి కార్తీక్ను తప్పించారు. కార్తీక్ పద్ధతేమీ బాలేదని, అతని ప్రవర్తన అనైతికంగా ఉన్నదంటూ సినిమా నుంచి తప్పించడం విశేషం. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ సగం పూర్తయింది. ఇలాంటి సమయంలో హీరో క్యారెక్టర్ను తప్పించి ధర్మ ప్రొడక్షన్స్ పెద్ద రిస్కే తీసుకుంది.
మరో హీరోతో రీషూట్ చేయడం, ఇప్పటికే కోల్పోయిన టైమ్తో ధర్మ ప్రొడక్షన్స్కు భారీ నష్టమే వాటిల్లనుంది. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని మూవీ యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ధర్మ ప్రొడక్షన్సే కాదు.. నిజానికి ఏ పెద్ద నిర్మాణ సంస్థ సినిమా షూటింగ్ మధ్యలో హీరో క్యారెక్టర్ను తప్పించడం చాలా అరుదుగా జరుగుతుంది. అయితే కార్తీక్ ప్రవర్తన బాగా లేకపోవడంతోపాటు అతని డేట్స్పై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో ధర్మ ప్రొడక్షన్స్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
2008లో వచ్చిన సూపర్ హిట్ మూవీ దోస్తానాకు ఇది సీక్వెల్. ఇందులో కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు చాలా రోజుల కిందటే ధర్మ ప్రొడక్షన్స్ ప్రకటించింది. అటు కార్తీక్ ఆర్యన్ కూడా ఈ మూవీ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు 2019లోనే చెప్పాడు. అయితే ఇప్పుడు ఈ మూవీ కాదు కదా.. భవిష్యత్తులోనూ మళ్లీ కార్తీక్తో మూవీ ఆలోచనే చేయకూడదని ధర్మ ప్రొడక్షన్స్ నిర్ణయించినట్లు సమాచారం.