లక్నో: కరోనాతో మరణించిన ఒక వ్యక్తి మృతదేహానికి రెండున్నర నెలల తర్వాత శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే తన భర్త మృతదేహాన్ని అప్పగించేందుకు వైద్యులు రూ.15,000 లంచం డిమాండ్ చేశారని భార్య ఆరోపించింది. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఈ ఘటన జరిగింది. 28 ఏండ్ల నరేశ్కు ఏప్రిల్ 10న కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఆయనకు తొలుత హాపూర్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం నరేశ్ను మీరట్లోని లాలా లాజ్పత్ రాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఏప్రిల్ 15న చనిపోయాడు. విషయం తెలిసిన ఆయన భార్య గుడియా తన ఇద్దరు పిల్లలతో కలిసి సుమారు 700 కిలోమీటర్లు ప్రయాణించి బస్తీ నుంచి మీరట్కు చేరకున్నది. అయితే భర్త మృతదేహాన్ని అప్పగించేందుకు వైద్యులు రూ.15,000 డిమాండ్ చేసినట్లు ఆమె ఆరోపించింది. డబ్బులు ఇవ్వని పక్షంలో మృతదేహానికి తామే అంత్యక్రియలు నిర్వహిస్తామని వారు చెప్పారని, దీంతో అంత డబ్బులు లేక తాను తిరిగి ఊరికి వెళ్లానని పేర్కొంది.
మరోవైపు కరోనా మృతుడి భార్య ఆరోపణలను మీరట్ ఆసుపత్రి డాక్టర్లు ఖండించారు. కరోనాతో మరణించిన ఆ వ్యక్తి మృతదేహాన్ని తీసుకునేందుకు ఎవరూ రాకపోవడంతో చోటు లేక హాపూర్ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు డాక్టర్ విదిత్ దీక్షిత్ తెలిపారు. అక్కడి వైద్యులు మృతుడి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకునేందుకు పోలీసుల సహాయం కోరారని చెప్పారు. పోలీసులు ఇటీవల మృతుడి భార్య గుడియాతో ఫోన్లో మాట్లాడి ఆమెను హాపూర్కు రప్పించినట్లు తెలిపారు. అనంతరం హాపూర్ మున్సిపల్ సిబ్బంది ఈ నెల 2న భార్య సమక్షంలో నరేశ్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారని వెల్లడించారు. కాగా, కరోనాతో చనిపోయిన భర్త మృతదేహాన్ని అప్పగించేందుకు వైద్యులు రూ.15 వేలు డిమాండ్ చేశారన్న మృతుడి భార్య ఆరోపణలపై మీరట్ జిల్లా కలెక్టర్ కే బాలాజీ దర్యాప్తునకు ఆదేశించారు.