న్యూఢిల్లీ: పంజాబ్లోని పటియాలాలో అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలు ఓ శునకాన్ని తమ బైక్కు కట్టుకుని వీధుల్లో తిరిగారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ మూగజీవి.. నాలుగు రోజుల్లోనే ప్రాణాలు వదిలింది. పటియాలా సమీపంలోని గ్రామానికి చెందిన చంచల్, సోనియా గత నెల 20న ఓ శునకాన్ని తమ బండికి కట్టుకున్నారు. పట్టణంలోని వీధుల్లో కలియదిరిగారు. దీంతో అది తీవ్రంగా గాయపడింది. ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యింది. కొందరు చిన్నారులు వారిని అడ్డుకోవడంతో ఆ కుక్కను అక్కడే వదిలివెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. ఆ ఇద్దరు మహిళలపై పోలీసులు జంతువులపై హింస నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, వారిని అరెస్టు చేశారు. ఆ శునకం జూన్ 24న మృతిచెందింది.
ఇలాంటి అమానవీయ ఘటనే కేరళలోని ఎడక్కరలో చోటుచేసుకుంది. జేవియర్ అనే వ్యక్తి తన పెంపుడు కుక్కను ద్విచక్రవాహనం వెనుకభాగంలో కట్టి పరిగెత్తించి క్రూరంగా ప్రవర్తించాడు. దాదాపు 3 కిలోమీటర్ల దూరం దానిని పరుగెత్తించాడు. ఈ ఘటనలో శునకానికి తీవ్ర గాయాలయ్యాయి. వెనుక వెళ్తున్న ఓ ఆటోలోని వ్యక్తులు బైక్ను ఆపాలని ప్రయత్నించినప్పటికీ జేవియర్ ఆగకుండా వెళ్లిపోయాడు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు అతనిపై జంతు సంక్షేమ చట్టం కింద కేసు నమోదుచేసి, అతడిని అరెస్టు చేశారు.