లక్నో : వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగునున్న కీలక రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ బీజేపీలో విభేదాలు ముదిరాయి. యూపీ సీఎంగా యోగి ఆదిత్యానాధ్ను తప్పిస్తారనే ప్రచారం ఇంకా సద్దుమణగకముందే ఆయనకు వ్యతిరేకంగా పలువురు పావులు కదుపుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యానాథ్ పార్టీ సీఎం అభ్యర్ధిగా ఉంటారని ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితులు, బీజేపీ ఉపాధ్యక్షుడు ఏకే శర్మ స్పష్టం చేయగా ఎన్నికల అనంతరం పార్టీ కేంద్ర నాయకత్వమే సీఎం ఎవరనేది నిర్ణయిస్తుందని సీనియర్ నేత, యూపీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య వ్యాఖ్యానించడంతో యూపీ కమలంలో కల్లోలం రేగింది.
ఇప్పటికే యోగి సారధ్యంపై అసమ్మతితో రగులుతున్న బీజేపీ నేతలు మౌర్య వాదనకు మద్దతిస్తున్నారు. యోగి సారధ్యంలో రాబోయే ఎన్నికలకు వెళతామని పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ చెబుతున్నా పార్టీ సారధి ఎవరో కేంద్ర నాయకత్వమే తేలుస్తుందని మౌర్య పునరుద్ఘాటించడం కమలం శ్రేణుల్లో గందరగోళానికి తావిస్తోంది. కరోనా మహమ్మారి కట్టడిలో యోగి మెరుగ్గా వ్యవహరించలేదనే విమర్శల నేపథ్యంలో పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. మరోవైపు పార్టీలో అసమ్మతులను చల్లార్చేందుకు ప్రభుత్వంలో, పార్టీ రాష్ట్ర శాఖలో కీలక మార్పులు చేపట్టాలని అధిష్టానం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.