న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు, కరెంటు కొరతపై ఆదివారం స్పందించారు కేంద్ర విద్యుత్శాఖ మంత్రి ఆర్కే సింగ్. బొగ్గు కొరతపై అనవసరంగా ఓ భయాన్ని సృష్టించారని.. ఇది గెయిల్, టాటా మధ్య సమాచార లోపం కారణంగా ఏర్పడిందని ఆయన అన్నారు. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో తీవ్ర విద్యుత్ సంక్షోభం పొంచి ఉన్న నేపథ్యంలో ఆర్కే సింగ్ ఇలా స్పందించారు. అనవరంగా భయపెట్టారు. దేశంలో నాలుగు రోజుల రిజర్వ్ ఉంది. ఢిల్లీకి బొగ్గు సరఫరా కొనసాగుతుంది. లోడ్ తగ్గించే ప్రసక్తే లేదు. ధరలతో సంబంధం లేకుండా దేశీయ లేదా దిగుమతి చేసుకున్న బొగ్గు సరఫరా కొనసాగుతుంది అని ఆర్కే సింగ్ స్పష్టం చేశారు.
గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లలోని విద్యుదుత్పత్తి కేంద్రాలలో బొగ్గు కొరత ఉన్నదని ఫిర్యాదు చేశాయి. పంజాబ్ ఇప్పటికే కొన్ని ప్రదేశాల్లో కోతలు విధిస్తోంది. బొగ్గు సరఫరా పెంచకపోతే దేశ రాజధాని మరో రెండు రోజుల్లో అంధకారంలోకి వెళ్లిపోతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి లేఖ రాశారు.