కొండాపూర్, ఏప్రిల్ 27 : కారు యజమాని నిర్లక్ష్యానికి 11 నెలల బాలుడు బలయ్యాడు.. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శ్రీరామ్నగర్ బీ బ్లాక్లో నివాసం ఉండే తోట వెంకట శివ ప్రసాద్ కుమారుడు తోట జశ్వంత్ (11నెలలు) మంగళవారం ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అదే సమయంలో అదే బ్లాక్కు చెందిన తాటి కిరణ్ నిర్లక్ష్యంగా కారును నడుపుతూ జశ్వంత్ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానిక జిల్లా దవాఖానకు తీసుకువెళ్లగా వైద్య పరీక్షల నిమిత్తం కొత్తగూడ టెస్లాకు తరలించారు. పరీక్షల అనంతరం దవాఖానకు తీసుకురాగా అప్పటికే బాబు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు వెంకట శివప్రసాద్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.