గువాహటి: కరోనా మహమ్మారి బారినపడి మరో ఎమ్మెల్యే కన్నుమూశారు. అసోంలోని యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్)కు చెందిన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే లెహోరామ్ బోరో (63) ఇటీవల కరోనా మహమ్మారి బారినపడ్డారు. అప్పటి నుంచి ఆయన గువాహటిలోని మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే చికిత్స కొనసాగుతుండగానే ఈ ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు.
లెహూరామ్ మరణం తమ పార్టీకి తీరని లోటు అని యూపీపీఎల్ అధ్యక్షుడు ప్రమోద్ బోరో చెప్పారు. ఇదిలావుంటే అసోం గవర్నర్ జగదీష్ ముఖి, ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ లెహోరామ్ మృతికి సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా, లెహోరామ్ మరణంతో అసోంలో కరోనా బారినపడి మరణించిన నూతన ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు చేరింది. ఈ నెల 26న బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్కు చెందిన మజేంద్ర నర్జారీ (68) కూడా కరోనాసోకి ప్రాణాలు కోల్పోయారు.