అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, జూలై 20: కరోనా మహమ్మారిపై పోరులో రాజకీయాలకు అతీతంగా కేంద్రం, రాష్ర్టాలు కలిసి ఒక జట్టుగా పనిచేయాలని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కరోనా నియంత్రణపై మంగళవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్తో పాటు పలు ప్రతిపక్ష పార్టీలు సమావేశానికి హాజరుకాలేదు. మోదీ మాట్లాడుతూ కరోనా కేసుల విషయంలో జనాభా నిష్పత్తిపరంగా చాలా ఇతర దేశాల కంటే భారత్ పరిస్థితి మెరుగ్గా ఉన్నదని చెప్పారు. బ్రిటన్ వంటి దేశాల్లో కరోనా మళ్లీ విజృంభించడాన్ని ప్రస్తావిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరికొన్ని కంపెనీల వ్యాక్సిన్లు త్వరలో అందుబాటులోకి వస్తాయని చెబుతూ దానికోసం కేంద్రం కృషిని వివరించారు. మరోవైపు కొవాగ్జిన్ వ్యాక్సిన్కు అంతర్జాతీయ గుర్తింపు సాధించే ప్రక్రియను వేగవంతం చేయాలని బీజేడీ, టీఎంసీ కోరాయి. తాము సమావేశాన్ని బహిష్కరించలేదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు. పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్రం వాస్తవాలను వెల్లడించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నదని చెప్పారు.