న్యూఢిల్లీ, జూలై 6: కేంద్ర మంత్రులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ఆర్సీపీ సింగ్ రాజీనామా చేశారు. తమ రాజీనామాలను బుధవారం ప్రధాని మోదీకి అందించారు. గురువారంతో రాజ్యసభ సభ్యులుగా ఈ ఇద్దరి నేతల పదవీ కాలం ముగియనుంది. ఇదిలా ఉండగా, బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ కేంద్ర మంత్రులుగా నఖ్వీ, ఆర్సీపీ సింగ్ల సేవలను ప్రశంసించారు. తద్వారా ఇదే వీరిద్దరి చివరి క్యాబినెట్ సమావేశం అని మీటింగ్లోనే సంకేతాలు ఇచ్చారని విశ్లేషకులు పేర్కొన్నారు. బీజేపీ సీనియర్ నేత అయిన నఖ్వీ రాజ్యసభలో ఆ పార్టీ ఉపనేతగా ఉన్నారు. గత నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో నఖ్వీకి బీజేపీ అవకాశం ఇవ్వలేదు. కాగా, ఆర్సీపీ సింగ్ జేడీయూ కోటాలో మోదీ క్యాబినెట్లో స్థానం పొందారు.
నఖ్వీ రాజీనామాపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన్ను ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలబెట్టాలనే యోచనలో బీజేపీ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ వర్మ అభ్యంతకర వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీపై దేశీయంగా, అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే కూటమి నుంచి మైనార్టీ వ్యక్తి బరిలోకి దింపాలని చూస్తున్నదని విశ్లేషణలు వస్తున్నాయి. ఉపరాష్ట్రపతి పదవి రేసులో ఎన్డీయే తరపున పంజాబ్ మాజీ సీఎం అమరిందర్ సింగ్, కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
రాజ్యసభ ఎంపీగా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పదవీకాలం ముగియడంతో పార్లమెంట్లో బీజేపీ తరపున ఒక్క ముస్లిం ఎంపీ ప్రాతినిధ్యం లేకుండా పోవడం గమనార్హం. లోక్సభ, రాజ్యసభల్లో బీజేపీకి 395 మంది ఎంపీలు ఉన్నారు. ఇకపై వీరిలో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేనట్టే. ఇటీవలి వరకు బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నమాజీ మంత్రులు ఎంజే అక్బర్, సయ్యద్ జాఫర్ల పదవీ కాలం ఇప్పటికే ముగిసింది. గత నెల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా అవకాశం కల్పించలేదు. దశాబ్దాలుగా కూడా బీజేపీ నుంచి ముస్లిం ఎంపీల ప్రాతినిధ్యం నామమాత్రమే.