హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో ఉద్యోగాల్లో సరికొత్త ఒరవడి వర్క్ఫ్రం హోం. ఐటీతోపాటు ఇతర అనేక సంస్థలు తమ ఉద్యోగులు ఇంటినుంచి పనిచేయించేందుకే ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారితోపాటు, ఉద్యోగులను నియమించుకొనే సంస్థలు కూడా దేశ సరిహద్దులు, ఎల్లలు చూడటం లేదు. ప్రతిభఉన్నవారు ఏ దేశస్థులైనా నియమించుకొనేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో వర్క్ఫ్రం హోంపై ప్రముఖ జాబ్సైట్ ఇండిడ్ సంస్థ తానుచేసిన అధ్యయనం వివరాలను వెల్లడించింది. గతేడాది ఏప్రిల్తో పోల్చితే ఈ ఏప్రిల్కు రిమోట్ వర్క్కోసం వెదికేవారు 966 శాతం పెరిగినట్టు తేలిందని సంస్థ వివరించింది. రిమోట్ జాబ్స్ పరిధిలోకి సాఫ్ట్వేర్ ఆర్కిటెక్, టెక్నికల్ లీడ్, డాటా ఇంజినీర్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సీనియర్ జావా డెవలపర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగం చేయడానికి ప్రాంతాలు, పట్టణాలు, దేశాలు చూడటం లేదని సరికొత్త నిర్వచనాలు ఇచ్చింది. ఈ హైబ్రిడ్ వర్క్కు నిరుద్యోగులు, కంపెనీలు సిద్ధపడుతున్నాయని వివరించింది. ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారిలో 60 నుంచి 64 ఏండ్ల వయస్సు వారు 15 నుంచి 19 శాతం, 40 నుంచి 44 ఏండ్ల మధ్యవారు 13 శాతం చొప్పున ఉన్నారని తమ అధ్యయనంలో తేలిందని సంస్థ పేర్కొన్నది. 35 నుంచి 39 ఏండ్లు, 20 నుంచి 24 ఏండ్ల మధ్య ఉద్యోగాల కోసం వెతికేవారు 12 శాతం చొప్పున ఉన్నట్టు తెలిపింది. రిమోట్ వర్క్ కోసం ప్రయత్నించేవారిలో బెంగళూరు నుంచి అత్యధికంగా 16 శాతం ఉండగా..ఢిల్లీ 11, ముంబై 8, పుణె 7, హైదరాబాద్ 6 శాతం మంది ఉన్నట్టు అధ్యయనం తెలింది. టెక్నికల్ సపోర్ట్ స్పెషలిస్ట్ ఉద్యోగం కోసం 25 శాతం మంది, డాటా ఎంట్రీక్లర్క్ 22, ఐటీ రిక్రూటర్, కంటెంట్ రైటర్ 16, బ్యాక్ ఎండ్ డెవలపర్ 15 శాతం మంది ప్రయత్నించారు.
ప్రపంచంలోనే అత్యధికంగా వర్క్ఫ్రంహోం చేస్తున్న దేశంగా భారత్ నిలుస్తున్నది. రాబోయే మరికొన్ని నెలలపాటు ఇది కొనసాగుతుంది. అనేక కంపెనీలు హైబ్రిడ్ విధానంలో పనిచేయించుకోవడానికి మొగ్గుచూపుతున్నాయి. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు తమ ప్రతిభ, నైపుణ్యాలపై మరింతగా దృష్టి పెట్టాలి. – శశికుమార్, ఎండీ, ఇండిడ్ ఇండియా సంస్థ