రాష్ట్రం పట్ల అవగాహన తక్కువ, అరుపులెక్కువ. ఇదీ తెలంగాణలో ఉన్న ప్రతిపక్షాల ధోరణి. అమలు కావలసిన విభజన హామీలు పట్టవు, రాష్ట్రం పట్ల విజన్ ఉండదు. అయినా రాష్ట్ర ప్రజల ఓట్లు మాత్రం కావాలంటాయి. తొండి విమర్శలతో గెలవొచ్చనే యావ తప్ప,ఇది సుదీర్ఘ ఉద్యమాలతో ఏర్పడిన రాష్ట్రమనే ధ్యాస విపక్షాల్లో ఏ కోశానా కనిపించదు. ఇది యూపీనో, బీహారో, గుజరాతో కాదనే విషయం అంతకన్నా పట్టదు. ఇక్కడ నిర్మాణాత్మక రాజకీయాలతో రాణించొచ్చు తప్ప, అకారణ విమర్శలతో రాణించలేమనితెలుసుకోలేకపోతున్నాయి. అందుకే పట్టభద్రులు విజ్ఞతతో ఓటేశారు.
‘అయిపోయింది.. అయిపోయింద’ని మూడు నెలలు విపక్షాలు వికృత ప్రచారం చేశాయి. ప్రభుత్వ ఉద్యోగాలు అసలు నింపనే లేదనే విపరీత ధోరణితో ప్రచారం చేశాయి. పట్టభద్రులు అధికార పార్టీని ఎలాగూ ఓడిస్తారనే అత్యాశలకు పోయాయి. కానీ అధికార పార్టీ అప్రమత్తమై ఎదురుదాడికి దిగింది. దీటైన జవాబులు చెప్పడం, సూటిగా ప్రశ్నించడం మొదలుపెట్టేసరికి ఒకరకంగా ప్రతిపక్షాలు తెల్ల మొఖాలేశాయి. శాఖల వారీగా జరిపిన ఉద్యోగ నియామకాలపై మంత్రి కేటీఆర్ విడుదల చేసిన శ్వేతపత్రం విపక్షాలకు మింగుడు పడని అంశంగా మారింది. పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో అదే ఒక కీలక మలుపైంది. మంత్రి కేటీఆర్ విసిరిన సూటి ప్రశ్నలకు ఓ ఢిల్లీ పార్టీ తట్టుకోలేకపోయింది. జవాబులు చెప్పలేకపోయింది. కనీసం విభజన హామీల అమలుపై నిలదీసినా జవాబుల్లేక మొఖం చాటేసింది. తెలంగాణ అస్తిత్వ పార్టీ నుంచి ఎదురు దాడి ఈ రేంజ్లో ఉంటదని ఆ పార్టీ కూడా ఊహించి ఉండకపోవచ్చు. దుబ్బాక ఉప ఎన్నికలో విమర్శలతో దూకుడు ప్రదర్శించిన ఆ పార్టీ.. పట్టభద్రుల ఎన్నికల్లో ఆత్మరక్షణలో పడిందనే చెప్పాలి. దాని దూకుడు విమర్శలను కేటీఆర్ సంధించిన బాణాల్లాంటి సూటి ప్రశ్నలే తిప్పికొట్టాయి. పట్టభద్రులను ఆలోచింపజేశాయి.
ప్రభుత్వరంగ సంస్థల అమ్మకంపై, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరల పెరుగుదలపై జవాబు చెప్పుకోలేని ఆ పార్టీని మంత్రి కేటీఆర్ ప్రజా కోర్టులో నిలబెట్టారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, బుద్ధిజీవులు ఆలోచించడం మొదలుపెట్టారు. దేశంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న పార్టీ.. ఉన్న ఉద్యోగాలను ఊడబెరుకుతున్నదనే కఠోర నిజాన్ని గమనించారు. 1.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపి, ప్రైవేట్రంగంలో 2 లక్షల కోట్ల పెట్టుబడులతో సుమారు 14 లక్షల ఉద్యోగ లేదా ఉపాధి మార్గాలను చూపిన తెలంగాణ అధికార పార్టీనే ఎందుకు గెలిపించకూడదనే బలమైన అభిప్రాయం పట్టభద్రుల్లో కనిపించింది.
సహజంగా పట్టభద్రుల ఎన్నికలను ప్రభుత్వాలు పెద్ద సీరియస్గా పరిగణించవు. కానీ మన రాష్ట్రంలో ప్రతిపక్షాల అకారణ విమర్శల నేపథ్యంలో ఆ ఎన్నికలను కూడా సీరియస్గా తీసుకోక తప్పలేదనే చెప్పాలి. ‘నిజం’ చెప్పులు తొడుక్కునే లోపే ‘అబద్ధం’ ప్రపంచాన్నే చుట్టేసి వస్తుందని నానుడి. విపక్షాల విమర్శలూ అలాంటివే అని ఇంటి పార్టీలో చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుడి దాకా అందరికీ అవగతం చేయడంలో సీఎం కేసీఆర్ సఫలమయ్యారు. అందుకే పార్టీ యంత్రాంగం ఇంతగా కదిలి పనిచేసిన సందర్భం ఇదేనేమో అనిపించింది! గెలిచితీరాలె అనే పట్టుదల ప్రతి కార్యకర్తలో కనిపించింది. ఈ గెలుపే రేపటి గెలుపులకు పునాది అనే సిక్త్స్ సెన్స్లో క్యాడర్ పనిచేసింది. స్వయాన కేసీఆర్ పర్యవేక్షణతోనే క్యాడర్లో ఆ స్ఫూర్తి రాగలిగిందని విశ్లేషకుల అభిప్రాయం కూడా. అబద్ధాన్ని ఓడించాలనే పట్టుదలను క్యాడర్లో ఆయనే తేగలిగారు. అందుకే పోలింగ్ శాతం కూడా బాగా పెరిగింది. తెలంగాణ అస్తిత్వ పార్టీలో ఇంతటి బలమైన టెంపో చూసి ప్రతిపక్షాలు కూడా ఆశ్చర్యపోయి ఉంటాయి! తెలంగాణ అస్తిత్వ పార్టీ రాజకీయంగా పట్టు బాగా విస్తరించిందని పట్టభద్రుల ఎన్నికలు మరోసారి రుజువు చేశాయి. 60 లక్షలకు పైగా కార్యకర్తలు కలిగిన బలమైన పార్టీ తన సత్తా చాటింది. భవిష్యత్తులో ఎలా పనిచేయాలో కూడా కేసీఆర్ తమ పార్టీ క్యాడర్కు ఈ ఎన్నికల్లో నేర్పారనే చెప్పాలి. వారు రసీదు కార్యకర్తలు మాత్రమే కాదు, ప్రజలను ఒప్పించి మెప్పించే కార్యకర్తలు కూడా అని రుజువు చేసుకోవడానికి పట్టభద్రుల ఎన్నికలు ఉపయోగపడ్డాయి. ఆరు ఉమ్మడి జిల్లాలంటే 60 శాతం తెలంగాణలో జరిగిన పట్టభద్రుల ఎన్నికలవి. ఇది పట్టభద్రుల తీర్పే అయినా.. దీనికి సాధారణ ఎన్నికల స్థాయిని ప్రతిపక్షాలే తెచ్చిపెట్టాయి. తమ అకారణ విమర్శలకు అర్థం లేదని తమకు తామే రుజువు చేసుకున్నాయి. ఏదో ఒక గెలుపుతో ఆ పూటకు ఊగిపోయేవారు ఉండొచ్చు తప్ప, తెలంగాణ వ్యాప్తంగా జనాదరణ గల నాయకుడు కేసీఆర్ తప్ప మరెవరూ లేరని ఎన్నిసార్లయినా రుజువవుతూనే వస్తున్నది. తెలంగాణను తొండి విమర్శలతో పక్కదారి పట్టించే యత్నాలను ఓడించక తప్పదనే కేసీఆర్ దృఢ నిశ్చయాన్ని కార్యకర్తలు గెలిపించారు.
ఇటీవలి ఎమ్మెల్సీ ఫలితాల అనంతరం కేసీఆర్ మొఖంలో కనిపించిన ఆనందం గత సాధారణ ఎన్నికల కంటే రెట్టింపై కన్పించింది. ఎందుకంటే, పట్టభద్రుల ఎన్నికలు సహజంగా విజ్ఞులు, విద్యావంతుల ఆలోచనలకు అద్దం పడుతాయి. వారి తీర్పు ఒక ప్రభుత్వానికిఆశీర్వచనమనే చెప్పాలి. భవిష్య ప్రజా తీర్పులకూ అదో సంకేతమే!
కొసమెరుపు: నిన్న ఓ పత్రికా సంపాదకుడు ‘పట్టభద్రులయితే మాత్రం కొమ్ములుంటాయా?’ అంటూ ఓ వ్యాసం రాశారు. ఆయన వ్యాస సారాంశం ఏమంటే, పట్టభద్రులనేవారు అధికారపార్టీని ఓడించేవారు తప్ప గెలిపించేవారు కాదని! తెలంగాణలో అందుకు భిన్నమైన తీర్పు ఇచ్చారనేదే అందులోని వెటకారం! అధికార పార్టీ మంచి చేసినా వ్యతిరేకించాల్సిందే అనే విపరీత ధోరణి పట్టభద్రులను పరోక్షంగా కించపరిచేలా ఉండటం దురదృష్టకరం. ఒక పార్టీ పట్ల ఆ సంపాదకుడిది భిన్నమైన భావజాలమే కావచ్చు. కానీ తన భావజాలాన్ని పట్టభద్రులపై రుద్దుతూ తీర్పివ్వడం సమంజసమేనా? ఆయన వ్యాస సారాంశాన్ని ఏ రకంగా తీసుకుంటే ఆ రకంగానే అర్థం చేసుకునే వాళ్లుండవచ్చు! కానీ ప్రభుత్వాలు ఏవైనా కూడా చెడే చేస్తాయనే ఆయన పరోక్ష వింత ధోరణిని ఎవరైనా సమర్థించగలరా? మెరుగైన పరిపాలన అందించినా కూడా పట్టభద్రులు దాన్ని ఓడించాల్సిందేనా? మంచి పాలనను ఆదరించిన పట్టభద్రులకు కొమ్ములున్నాయనే ఎవరైనా భావిస్తారు! మేధావితనం ఇనుమడిస్తే ప్రయోజనం, ముదిరిపోతేనే అప్రయోజనం.