కొచ్చి : కేరళ నన్స్ యూపీ మీదుగా ప్రయాణిస్తుండగా వారిపై కొందరు దాడికి పాల్పడ్డారని ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన ఆరోపణలను కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తోసిపుచ్చారు. విజయన్ తప్పుడు ప్రకటనలు ఇచ్చారని ఆయన మండిపడ్డారు. నన్స్పై ఎక్కడా దాడి జరగలేదని, సీఎం తప్పుడు ప్రకటనలు ఇస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కొచ్చిలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో పీయూష్ గోయల్ పేర్కొన్నారు. మార్చి 19న ఝాన్సీలో నన్స్పై దాడి చేశారనే సమాచారం బయటకు పొక్కడంతో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్ని పాలక ఎల్డీఎఫ్ తెరపైకి తెచ్చింది.
నన్స్పై యూపీలో దాడి జరిగిన ఘటనలో నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని సీఎం విజయన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. యూపీలో కేరళ నన్స్ మతమార్పిడి చేసేందుకు ప్రయత్నించారని కొందరు ఫిర్యాదు చేయగా స్ధానిక పోలీసులు విచారణ చేపట్టి వారిని విడిచిపెట్టారని చెప్పారు. నన్స్ను రైలు నుంచి దింపివేసి ఏబీవీపీ విద్యార్ధులు దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని మంత్రి పేర్కొన్నారు. అయితే నన్స్పై ఎవరు ఫిర్యాదు చేశారనే వివరాలను మంత్రి వెల్లడించలేదు.